నిజామాబాద్ : బోధన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్(MLA Shakeel), బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )అన్నారు. ఓటమికి భయపడే బీఆర్ఎస్ శ్రేణులపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైందని, బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలువబోతుందని తెలిసి దాడులకు తెగబ డుతున్నారని విమర్శించారు. 60 లక్షల గులాబీ సైన్యం ముందు మీరెంత.. సత్తా కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులను ప్రజాక్షేత్రంలో దీటుగా ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఇలాంటి దాడులకు తెగబడితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
కాగా, బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండలంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ప్రచారం నిర్వహిస్తుండగా, ఆయా గ్రామాల్లో కొంతమంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో సాటాపూర్ గేటు వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే షకీల్ పై దాడికి యత్నించారు. కాంగ్రెస్ నాయకులు కొంతమంది బీఆర్ఎస్ యువకులను కొట్టి గాయపరిచారు. తనపై కాంగ్రెస్ నాయకులు, గూండాలు హత్యాయత్నం చేశారని షకీల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.