కామారెడ్డి, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): దశాబ్దాలుగా దళితులను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఎస్సీ డిక్లరేషన్ పేరుతో దళితులను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ సంక్షేమాన్ని ఎందుకు పట్టించుకోలేదని హస్తం పార్టీని నిలదీశారు. మూడు నల్ల చట్టాలు తెచ్చి 850 మంది రైతుల చావుకు కారణమైన బీజేపీ పార్టీ.. ‘రైతు భరోసా’ సభ నిర్వహించడం, దానికి అమిత్షా రావడం.. హంతకులే వచ్చి నివాళులర్పించినట్టు ఉన్నదని ఎద్దేవా చేశారు. వారి పార్టీలకు కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి ఉన్నదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించగా, ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్తో కలిసి సోమవారం కామారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఖర్గేను ఇక్కడికి తీసుకొచ్చి, బీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పనులనే తాము చేస్తామని చెప్తున్నారని.. వారి మాటలు ప్రజలెవరూ పట్టించుకోబోరని అన్నారు. దళితుల కోసం పని చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని స్పష్టం చేశారు.
రైతులను మోసం చేసిందే బీజేపీ!
ఖమ్మం సభలో అమిత్ షా రైతులపై ప్రేమ ఒలకబోశారని, అసలు అన్నదాతలను ఆదినుంచీ మోసం చేస్తూ వస్తున్నదే బీజేపీ పార్టీ అని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బీజేపీ ఇప్పుడు తెలంగాణ గడ్డపై రైతు డిక్లరేషన్ పేరిట రైతు భరోసా సభ పెట్టిందని దుయ్యబట్టారు.‘రైతు భరోసా’ పేరుతో బీజేపీ ఆడుతున్న డ్రామాలు ఇక్కడి రైతులకు తెలుసునని, వారు సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని తెలిపారు.
సీఎం అభ్యర్థి ఎవరో తేల్చుకోలేని పార్టీలు
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ సీఎం అభ్యర్థులను ప్రకటించలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు. షబ్బీర్అలీ కోసమే సీఎం కేసీఆర్ కామారెడ్డి బరిలో నిలిచారనేది ఓ జోక్లా ఉన్నదని అన్నారు. షబ్బీర్ అలీని తమ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నాలుగుసార్లు ఓడించారని గుర్తుచేశారు. వ్యూహంలో భాగంగానే ఇక్కడినుంచి బరి లో నిలుస్తున్నారని కవిత స్పష్టం చేశారు.
కామారెడ్డికి 25 కోట్లు విడుదల: గంప గోవర్ధన్
కామారెడ్డి పట్టణ అభివృద్ధికి రూ.25 కోట్ల నిధులు విడుదలయ్యాయని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. సోమవారం ఆయన కామారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. పట్టణంలో అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ రూ.45 కోట్లు ప్రకటించారని గుర్తుచేశారు. ఇందులో రూ.25 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయని, త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపడుతామని చెప్పారు.