MLC Kavitha | నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు 8+8= జీరో అయ్యిందన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు పైసా ఇవ్వలేదని విమర్శించారు. పసుపు బోర్డుకు కూడా పైసా ఇవ్వలేదని ఆరోపించారు. ఎంపీ అరవింద్ ఇందూరు బిడ్డనే అయితే.. పసుపు బోర్డుకు చట్టబద్ధత తేవాలని డిమాండ్ చేశారు. అన్ని బోర్డులకు పార్లమెంట్ చట్టం చేస్తే.. పసుపు బోర్డ్ గెజిట్ ద్వారా ప్రకటించారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కూడబలుక్కొని దోచుకుంటున్నాయన్నారు.
60 లక్షల మంది ఉన్న పెద్ద కుటుంబం బీఆర్ఎస్ అన్నారు. పార్టీ ప్రారంభమైన ప్రతి ఉద్యమం లక్ష్యం చేరుకోవడం కష్టమన్నారు. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేసీఆర్ను ప్రశంసించారని గుర్తు చేశారు. ఉద్యమంలో అనేక సంక్లిష్టమైన పరిస్థితులను చూశానని.. కేసీఆర్ దీక్ష చేయొద్దని చాలామంది కన్నీళ్లు పెట్టుకున్నారన్నారు. కేసీఆర్ బక్క మనిషే అయినా.. మొండి మనిషి అన్నారు. అయితే తెలంగాణ జైత్రయాత్ర.. లేకుంటే కేసీఆర్ శవయాత్ర అని దీక్షకు బయలుదేరారన్నారు. కేసీఆర్ పిలుపునిస్తే ఊరూవాడలు కదిలాయన్నారు. స్వరాష్ట్ర ఉద్యమం ప్రతి సందర్భం స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ కోసం 36 పార్టీలను కేసీఆర్ ఒప్పించారని.. మాయావతిని ఒప్పించేందుకు కేసీఆర్ 50 సార్లు వెళ్లి కలిశారన్నారు. యూపీఏ ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని తెలిపారు. మళ్లీ 30 ఏళ్లు అధికారంలోకి రారని కాంగ్రెస్ వాళ్లకు తెలుసని.. అందుకే ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నారని ఆరోపించారు.
ప్రజలు ఒక అవకాశం ఇచ్చారని.. కాంగ్రెస్ వాళ్లు ప్రజలకు సేవ చేసేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. కాంగ్రెస్ పాలనలో 20 పర్సెంట్ కమీషన్ అని ఢిల్లీలో చెప్పుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం గురించి అలా మాట్లాడుకుంటే బాధగా అనిపించిందన్నారు. 25 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రస్థానం.. తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర.. అటుకులు తినైనా బతుకుతాం.. ఆత్మగౌరవం వదులుకోబోమని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. తర్వాత వచ్చేది బీఆర్ఎస్ 3.O వెర్షన్ అని.. కార్యకర్తలు చెప్పేదే బీఆర్ఎస్ చేస్తుందన్నారు. తెలంగాణ, నిజామాబాద్ అభివృద్ధి కోసం ఆనాడు బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీలో చేరారన్నారు. పార్టీ కార్యకర్తలందరికీ అండగా ఉంటానని.. ప్రతి ఊరిలో గులాబీ జెండా ఎగురవేసి వరంగల్ సభకు బయలుదేరాలని కోరారు.