హైదరాబాద్ : నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయమని అన్నారు. ఇది రాష్ట్రాల హక్కులను హరించడమేనని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) అన్నారు. ఆదివారం తెలంగాణ సారస్వత పరిషత్లో భారత రాజ్యాంగం పై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం పనితీరు ఉందన్నారు. కింది స్థాయిలో పథకాలు అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ, బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి మీకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వము అని మాట్లాడుతున్నారు.
రాజ్యాంగంలో(Constitution) ఉన్న ఫెడరల్ స్ఫూర్తి ఏమైనట్లు అని సూటిగా ప్రశ్నించారు. బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రాల హక్కులను హరించే అధికారం వాటికి లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు. దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని కాపాడాలి అని అంటున్నారు. నేను ఆయనను తెలంగాణకు స్వాగతిస్తున్నా.. మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మీరు చెబుతున్న రాజ్యాంగాన్ని ముందు తెలంగాణలో కాపాడాలని హితవు పలికారు.
కొన్ని నెలల క్రితం ఆసిఫాబాద్లో మతకల్లోలాలు జరిగి వందలాది మంది నిరాశ్రులయ్యారు. వాళ్ల గురించి ఒక్క నాయకుడు కూడా మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్లో నెలల తరబడి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి వాళ్లకు ఎలాంటి ఆర్థిక సహాయం గానీ నష్టపరిహారం కానీ అందలేదన్నారు. ప్రభుత్వ పెద్దలు కనీసం వాళ్లను పరామర్శించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కనీసం అటు వైపు చూడలేదన్నారు. రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి సందర్భంలో విద్యార్థులు ఈ కార్యక్రమం నిర్వహించడాన్ని కవిత అభినందించారు.