MLC Kavitha | హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తోడ్పాటుతోనే గిరిజనులు సాధికారత సాధించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రిజర్వేషన్ల పెంపుతో విద్యాసంస్థల్లో గిరిజన బిడ్డలకు అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు. 3,300 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు. బుధవారం హైదరాబాద్ నుంచి జూమ్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంతర్జాతీయ బంజారా విద్యార్థులతో ఆమె మాట్లాడారు. సబ్ప్లాన్ నిధులను సమర్థంగా వినియోగించుకుంటున్న ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయి నిధులను వినియోగించలేదని గుర్తుచేశారు. గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సీఎం ఎస్టీ ఆంత్రప్రెన్యూర్ కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం కింద రూ.2 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం రుణం ఇస్తున్నదని పేరొన్నారు. తెలంగాణలో గిరిజన జనాభా పెరిగినందున ఎస్టీ రిజర్వేషన్లను పెంచాలని కేంద్రాన్ని తాము విజ్ఞప్తి చేశామని, కేంద్రం పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లను పెంచిందని గుర్తు చేశారు. తద్వారా మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో ఎస్టీ విద్యార్థుల ప్రవేశాల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు.
వ్యవసాయ మారెట్ కమిటీ పదవుల్లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, మెడికల్ షాపుల ఏర్పాటులో కూడా ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించామని కవిత వివరించారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్య వసతులను మెరుగుపర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తూనే ఉన్నదని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలే కాకుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కేసీఆర్ సర్కారు కృషి చేస్తున్నదని, అన్ని సామాజికవర్గాల సాధికారతకు పాటుపడుతున్నామని కవిత చెప్పారు. తెలంగాణ నుంచి అనేక మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటుండటం సంతోషకరమని పేర్కొన్నారు.