బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో ప్రజలు నిస్సహాయులుగా మిగిలిపోయారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తంచేశారు. బీజేపీ పాలనలో ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగలేదని తెలిపారు. ఎనిమిదేళ్ల పాలనలో బీజేపీ వైఫల్యాలపై ఆమె మోడీ సర్కారుకు ట్విటర్ వేదికగా ఎనిమిది ప్రశ్నలు సంధించారు. మోదీ సర్కారు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సవాల్ విసిరారు.
1.మహిళా శక్తికి సమాన ప్రాధాన్యత కల్పించడం ద్వారా మహిళా సాధికారత సాధించడం. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎక్కడ మోడీ జీ?
2.మన దేశ జీడీపీ పడిపోతున్నా.. గ్యాస్,డీజిల్,పెట్రోల్ (జీడీపీ) ధరలు పెరుగుతున్నాయి. విచిత్రంగా అవి దేశ ప్రభుత్వ నియంత్రణలో ఎందుకు లేవు? అమితంగా పెంచిన ఇంధన ధరల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎక్కడ పెట్టుబడిగా పెట్టారు?
3. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ప్రభుత్వ పక్షపాతానికి ముగింపు ఎప్పుడు? తెలంగాణకు రావాల్సిన రూ.7000 కోట్ల పెండింగ్ నిధులను బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుంది?
4.ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంది, “మెహంగై ముక్త్ భారత్” అని ప్రకటించుకున్న మీరు అసలు అలాంటి “అచ్ఛే దిన్” ఎప్పుడు తెస్తారు?
5.విఫలమైన లా అండ్ ఆర్డర్, విఫలమైన వ్యవస్థలు.. భారతదేశ ప్రజలకు కృత్రిమ ప్రచారాలు లేని నిజమైన “అమృత్ కాల్” ఎప్పుడు వస్తుంది?
6. రైతులు భారతదేశానికి గుండె చప్పుడు.. కానీ, ఈ రోజు తెలంగాణలోని వరి రైతులు, పసుపు రైతులు తమ కష్టానికి కనీస గుర్తింపును కోరినందుకు బీజేపీ చేతిలో నష్టపోతున్నారు!
7. మోడీ ప్రభుత్వ “న్యూ ఇండియా” వాస్తవికత ఏంటంటే, ఇక్కడ కోట్లాది మంది భారతీయులు తమకు కనీస ఆదాయం అందించే ఉపాధిని పొందడంలో కష్టపడుతున్నారు.
8. చివరగా, పీఎం కేర్స్ నిధుల గురించిన నిజమైన సమాచారం దేశ ప్రజలకు తెలియజేసే రోజు వస్తుందా?