మహిళలు ఎక్కడైతే రక్షించబడతారో.. ఎక్కడైతే గౌరవించబడతారో ఆ దేశం, ఆ సమాజం బాగుపడ్తది. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’ అని వేదంలో కూడా చెప్పారు. మహిళలు ఎక్కడ గౌరవించ బడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు. ఆ సమాజం బాగుపడ్తది. మహిళల్లో గొప్ప ప్రతిభాశాలురు ఉన్నారు. మహిళలే దేశాన్ని నడిపే నవశక్తులు. ప్రతిభావంతులైన మహిళలను ఎప్పటిదాకైతే మనం ముందువరుసలో పెట్టమో, వాళ్ల ప్రతిభను చాటిచెప్పే అవకాశం మనం ఇవ్వమో అప్పటిదాకా ఈ దేశం బాగుపడది
-సీఎం కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి కేంద్రంలోని బీజేపీ సర్కారే మద్దతు కూడగట్టాలని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టడం సంతోషంగా ఉన్నదని, బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు అందుకు సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలను విశ్వాసంలోకి తీసుకొని చర్చిస్తేనే పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం పొందే ఆసారం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
మహిళా బిల్లు ఆమోదం పొందితే పార్లమెంటులో మహిళా సభ్యుల సంఖ్య 181కి చేరుతుందని, తద్వారా దేశ నిర్మాణానికి మహిళా శక్తి చేకూరుతుందని స్పష్టం చేశారు. లోక్సభలో మంగళవారం మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా హైదరాబాద్లోని ఆమె నివాసంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్, సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే తాము మహిళా బిల్లు కోసం ఉద్యమించామని చెప్పారు.
2010 నాటి బిల్లులో ఉన్న అంశాలే ఇందులో ఉన్నాయని, కొత్త అంశాలేమీ లేవని పేర్కొన్నారు. గతంలోని అభ్యంతరాలే ఈ సారి కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంటుందని, ముఖ్యంగా ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు లేవని పేర్కొన్నారు. ఈ విషయంలో దేశ మహిళలకు స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అలాగే, జనగణన ఎప్పుడు చేస్తారు? డీలిమిటేషన్ ఎప్పుడు చేస్తారు? ఏ ఎన్నికల నాటికి ఈ బిల్లు అమల్లోకి వస్తుంది? వంటి ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓబీసీ మహిళల హకులను పరిరక్షించాలని కోరారు.
అన్ని పార్టీలను ఒప్పించే బాధ్యత కేంద్రానిదే
రాజ్యసభలో బిల్లు నెగ్గేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ కవిత కోరా రు. బిల్లుకు బీఆర్ఎస్ వంటి పార్టీలు మద్దతిస్తామని ప్రకటించినా.. బిల్లును ప్రవేశపెట్టే సమయంలో కాంగ్రెస్ పలు అభ్యంతరాలను వ్యక్తం చేసిందని చెప్పారు. అన్ని పార్టీలను ప్రభుత్వం ఒప్పిస్తే మంచి వాతావరణంలో సజావుగా బిల్లు ఆమోదం పొందుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. శీతాకాల సమావేశాల ముందు కూడా ఢిల్లీలో ధర్నా చేస్తానని తాను ప్రకటించానని, కానీ అకస్మాత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి బిల్లును ప్రవేశపెట్టిందని చెప్పారు.
మహిళా బిల్లును ప్రవేశపెట్టడానికి ఒత్తిడి చేయాలని 47 పార్టీలకు తాను లేఖ రాసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మహిళలకు 33 శాతం, ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కావాలని, అందుకు రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించిన విషయాన్ని గుర్తుచేశారు. తొమ్మిదిన్నరేండ్ల జాప్యం తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ ఓబీసీ, మహిళా బిల్లు పై ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాశారని చెప్పారు. లోక్సభలో పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ ఉండటంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ బిల్లును ఆమోదించేలా అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నిలకు కేవలం ఆరు నెలల ముందు బిల్లును తీసుకొస్తున్నా దీన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.