ED Office | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్లో ఆమె ఇంటి నుంచి అరెస్టు చేసిన ఈడీ అధికారులు శుక్రవారం రాత్రి ఢిల్లీ తీసుకువచ్చారు. రాత్రి సుమారు 12.00 గంటల ప్రాంతంలో ఆమెను ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్ భవన్కు తరలించారు. అయితే ఢిల్లీలో కూడా పోలీసులు హైడ్రామాకు తెరలేపారు. ఎయిర్పోర్టు వద్ద కవిత మీడియా కంటపడకుండా ఈడీ అధికారులు ఆమెను వేరే గేటు గుండా తమ కార్యాలయానికి తరలించారు. ఇక పరివర్తన్ భవన్ వద్ద 144 సెక్షన్ విధించారు. ఈడీ కార్యాలయంలో కవితను ప్రత్యేక సెల్లో ఉంచారు. అక్కడే వైద్య బృందం ఆమెకు పరీక్షలు నిర్వహించింది.
నేడు కోర్టు ముందుకు..
కవితను శనివారం ఉదయం రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. న్యాయస్థానం కవితను ఈడీ కస్టడీకి ఇస్తుందా.. లేదా అన్నది చూడాలి. ఒకవేళ ఈడీ కస్టడీకి ఇవ్వకపోతే 14 రోజుల రిమాండ్ విధించే అవకాశం ఉన్నది.
బెయిల్ పిటిషన్కు ఏర్పాట్లు
తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్నట్టు తెల్సింది. ఈ మేరకు ఆమె న్యాయవాదుల బృందం బెయిల్ పిటిషన్ను సిద్ధం చేస్తున్నది.