MLC Kavitha | రకరకాల వ్యూహాల్లో భాగంగా సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారని, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నేత ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీకి దిగుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. వారికి మిగిలేది వాతలు మాత్రమేనని, ఫలితం రాదని, వారు మూడునాలుగు చోట్ల పోటీకి దిగినా అంతిమంగా గెలిచేది మాత్రమం బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. బోధన్లో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్ నిర్వహించిన కుల సంఘాల గర్జన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం చెప్పిన కవిత.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూడాలని హితవు పలికారు.
బీజేపీకి బీసీలపై ప్రేమ ఉంటే తక్షణమే కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటును ప్రకటించాలని, తక్షణమే బీసీలకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ కులగణనపై సానుకూల ప్రకటన చేయాలని డిమండ్ చేశారు. అంతేకానీ, ఎన్నికలు ఉన్నాయని తెలంగాణకు వచ్చి ఉట్టి మాటలు చెప్పి వెళ్లవద్దని అన్నారు. ప్రధాన మంత్రి వచ్చిపోయిన తర్వాత ఎల్లుండి రాహుల్ గాంధీ వచ్చి మళ్లీ అవే మాటలు చెప్పిపోతారని విమర్శించారు. రూ.4వేల కోట్లు ఖర్చు చేసి కాంగ్రెస్ హయాంలో చేపట్టిన కులగణన నివేదికను ఆ పార్టీ బయటపెట్టలేదని, బయటపెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం అడగలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులవి ఉట్టుట్టి మొసలి కన్నీళ్లే తప్ప నిజమైన మాటలు కావని స్పష్టం చేశారు.
2014లో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి అందరి వివరాలు సేకరించామని.. కాబట్టే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లతో సహా వందలాది కార్యక్రమాలనే చేసుకుంటున్నామని వివరించారు. మంచి పనులు చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్ధతివ్వాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్కు కులం లేదు, మతం లేదని, సబ్బండవర్గాలు బాగుండాలన్న ఆలోచన మాత్రమే ఉందని తెలిపారు. రాష్ట్రానికి సీఎం కేసీఆర్ బలమైన పునాది వేశారని, దేశంలో రాష్ట్రం మరింత ఎదిగే రోజులు ముందున్నాయన్నారు. విద్యుత్, నిధులు, నీళ్లలో మిగులు సాధించామని వివరించారు. పిల్లల విద్యపై కేసీఆర్ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 19 పాఠశాలలు ఉంటే, గత పదేళ్లలో సీఎం కేసీఆర్ 63 పాఠశాలలు నిర్మించారని అన్నారు. దాంతో ఉమ్మడి జిల్లాలో పాఠశాలల సంఖ్య మొత్తం 82 చేరిందని చెప్పారు. ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమేనని చెప్పారు. బీసీలకు 2పాఠశాలలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు 23 పాఠశాలలకు చేరాయని చెప్పారు. షకీల్ కష్టమొచ్చినా బోధన్ లోనే ఉంటారని, ఏ పండగ అయినా బోధన్ లోనే ఉంటారని, కానీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్లీ ఎన్నికలు వస్తే తప్పా కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి బోధన్కు రారని విమర్శించారు. మరి ఎన్నికలప్పుడు వచ్చిపోయే ఎన్నికలు రెడ్డి, ఎన్నికల గాంధీలతో మనకు ఏం పని అన్నారు.
ఎప్పడూ అందుబాటులో ఉండే షకీల్ కావాలా ? సుదర్శన్ రెడ్డి కావాలా ? అన్నది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. దసరా పండగ వస్తే హిందూ ఆడబిడ్డలకు షకీల్ చీరలను పంచుతారని,
రంజాన్కు కొత్తబట్టలు పంచుతారని, క్రిస్మస్ కు ప్రతీ చర్చికి కేక్ పంపిస్తారని, ఇంత మంచి నాయకుడు
దొరుకుతాడా? అంటూ ప్రశ్నించారు. అన్ని వర్గాల గురించి ఆలోచించే షకీల్ వంటి వారిని పోగొట్టుకుంటే
ఇబ్బంది అవుతుందని, కాబట్టి ఓటు వేసే ముందు ఆలోచన చేయాలన్నారు.