కరీంనగర్ కార్పొరేషన్, జూలై 27: ‘బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఈటల రాజేందర్ గొప్పలకు పోతున్నడు. గజ్వేల్లో పోటీ చేస్తానని బీరాలు పలుకుతున్నడు. గజ్వేల్ ఎందుకు? దమ్ముంటే మరోసారి హుజూరాబాద్లో పోటీచేసి గెలువాలి’ అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి సవాల్ చేశారు. ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత ఈటల హుజూరాబాద్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేశారో? ప్రజల కోసం ఏం చేశారో..? చెప్పాలని, నియోజకవర్గంలోని అభివృద్ధిపై గురువారం బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. దీనికి ఈటల స్పందించకపోతే ఆయన తప్పు చేసినట్టుగానే తాము భావిస్తామని పేర్కొన్నారు. బుధవారం కరీంనగర్లోని మీ సేవ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కౌశిక్రెడ్డి మాట్లాడారు. హుజూరాబాద్ ప్రజలు ఉప ఎన్నికలో గెలిపిస్తే వారి సమస్యలను పట్టించుకోకుండా పారిపోతున్నదని ఈటల రాజేందర్ కాదా? అని ప్రశ్నించారు. ఒక్క రోజు కూడా స్థానికంగా ఉండటం లేదని, అభివృద్ధిపై ప్రజలు ఎక్కడ నిలదీస్తారోననే భయంతో పారిపోతున్నాడని దుయ్యబట్టారు.
మరోసారి హుజూరాబాద్లో పోటీ చేస్తే ఓడిపోతానన్న భయంతోనే గజ్వేల్లో పోటీ చేస్తానని ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పేరు, పత్రం లేని ఈటల రాజేందర్ను లీడర్ చేసిన కేసీఆర్నే మోసం చేశాడని ఆరోపించారు. టీఆర్ఎస్లో కేసీఆర్ బానిసలు అని వ్యాఖ్యలు చేస్తున్న ఈటల 2004 నుంచి 2021 వరకు టీఆర్ఎస్లోనే ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. మరి ఆ సమయంలో ఏ బానిసత్వం చేస్తే కేసీఆర్ ఈటలకు అన్ని పదవులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. దళితబంధు పథకంపై విమర్శలు చేస్తున్న ఈటల వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఇప్పటివరకు 18 వేలమంది లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేశామని, 15 వేల యూనిట్లను గ్రౌండింగ్ చేశామన్నారు. ఈ విషయంలో ఈటల సొంత ఊరు కమలాపూర్లోని ఎస్సీ కాలనీకి పోతే తెలుస్తుందన్నారు. దళిత ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, బాల్క సుమన్పై ఇష్టారాజ్యంగా మాట్లాడటం సరికాదన్నారు. దళితుల భూములను కబ్జా చేసిన చరిత్ర ఈటలదని దుయ్యబట్టారు. బీసీ ముసుగులో ఉన్న దొర ఈటల అని విమర్శించారు. ఐదెకరాల స్థలంలో గడీ కట్టుకొని పాలిస్తున్నది ఈటలనేనని ఆయన పేర్కొన్నారు. దమ్ముంటే నియోజకవర్గ అభివృద్ధి విషయంలో చర్చకు రావాలని, సీఎం కేసీఆర్ ఏం చేశారో చెబుతామన్నారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ విజయ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.