హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): దేశ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం పెరగాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. మహిళా బిల్లుపై బీజేపీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. మహిళాబిల్లు విషయంలో బీజేపీని కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. పెరగనున్న పార్లమెంటు సీట్లలో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని, ఇదే తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ విధానమని చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో సీనియర్ జర్నలిస్ట్ నిధిశర్మ రాసిన ‘షీ ద లీడర్.. ఉమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’ పుస్తకాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో అన్ని ఇండ్లలో ఏమి జరుగుతున్నదో రాజకీయ పార్టీల్లో కూడా అదే జరుగుతున్నదని వివరించారు. మహిళలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలన్న తప్పనిసరి నిబంధన లేనంతకాలం పార్టీల్లో అదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు 50% కాకుండా 33% మాత్రమే రిజర్వేషన్ ఎందుకు ఉండాలనే చర్చ జరుగుతున్నదని, ఎకడో ఒకచోట అడుగుముందుకు పడాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
మహిళాభ్యుదయంలో తెలంగాణ ఆదర్శం
మహిళాభ్యుదయం విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి దాకా అన్ని స్థాయిలో రాజకీయంగా మహిళలకు సీఎం కేసీఆర్ అవకాశాలు కల్పిస్తున్నారని ఉదహరించారు. స్థానికసంస్థల్లో సగం కంటే ఎక్కువ స్థానాలను మహిళలకు కేటాయించడమే కాకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవుల్లోనూ రిజర్వేషన్ కల్పించారని వివరించారు. దేశంలో కంపల్సరీ ఓటింగ్ రావాలని, ఇలాంటి వ్యవస్థపై అధ్యయనం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ మనీశ్తివారీ, ఎంపీ జాన్బ్రిటాస్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం తలచుకుంటే నిమిషంలో బిల్లు
కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ ప్రభుత్వం మహిళా బిల్లును ఆమోదించాలనుకుంటే ఒక నిమిషం చాలునని, కానీ, కేంద్రం ఆ రకంగా ఆలోచించడం లేదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల పేర్లను మార్చి కొత్త చట్టాలు తీసుకురావడానికి మూడు బిల్లులను తీసుకొచ్చిన కేంద్రం మహిళా బిల్లు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. కార్పొరేట్ రంగంలో బోర్డురూముల్లో మహిళల ప్రాతినిధ్యం స్వల్పంగా ఉన్నదని, వివక్ష కొనసాగుతూనే ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. మహిళలు ప్రారంభిస్తున్న దాదాపు 80% స్టార్టప్ సంస్థలకు బ్యాంకులు మద్దతివ్వడం లేదని, పురుషుల వ్యాపారాలతో పోల్చితే మహిళలు నిర్వహిస్తున్న వ్యాపారాలకు తకువ నిధులు ఇస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఏటేటా ఉద్యోగ రంగంలో మహిళల శాతం తగ్గుతున్నదని, చదువుకున్న మహిళలు ఎకడికి వెళ్తున్నారని ప్రశ్నించారు. దేశంలోని ఉద్యోగుల్లో మహిళలు 29% మాత్రమే ఉన్నారని, సమాజంలో మార్పురావాలని ఆకాంక్షించారు.
17 మంది ప్రతిభావంతుల్లో కవిత
జాతీయస్థాయిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 17 మంది మహిళా నేతల వివరాలతో ‘షీ ద లీడర్.. ఉమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’ పుస్తకాన్ని నిధిశర్మ రూపొందించారు. ఈ 17 మందిలో కల్వకుంట్ల కవిత, సోనియాగాంధీ, ప్రతిభాపాటిల్, సుచేతా కృపలాని, వసుంధరరాజే, సుష్మాస్వరాజ్, షీలాదీక్షిత్, జయలలిత, మాయావతి, మమతాబెనర్జీ, బృందాకరత్, అంబికాసోనీ, స్మృతిఇరానీ, సుప్రియ సూలే, కనిమొళి తదితరులు ఉండటం విశేషం.