నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే నెల 4 నుంచి 9వ తేదీ వరకు సీహెచ్ కొండూరులో జరగనున్న లక్ష్మీనరసింహస్వామి లోహమయ శిలామయ విగ్రహ ప్రతిష్టాపన, ఆలయ పునః ప్రారంభోత్సవ వేడుకల తొలి ఆహ్వాన పత్రికను నీలకంఠేశ్వరాలయ స్వామివారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, తమ ఇంటి ఇలవేల్పు అయిన సీహెచ్ కొండూరులోగల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పున ప్రారంభం వచ్చే నెల 4 నుంచి 9 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నామని తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలో ఏ కార్యం చేపట్టినా మొదట నీలకంఠేశ్వర ఆలయం స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ అని, అందుకే స్వామి వారికి ఆహ్వాన పత్రికను అందజేసినట్లు ఎమ్మెల్సీ కవిత చెప్పారు. నీలకంఠేశ్వర ఆలయ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే గణేష్ గుప్తా నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని వెల్లడించారు. ఆమె వెంట నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గుప్తా, నిజామాబాద్ మేయర్ నీతు కిరణ్ దండు, స్థానిక నాయకులున్నారు.