హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించకున్నా విద్యా వ్యవస్థలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. గత ఎనిమిదేండ్లుగా కేంద్రం తెలంగాణ పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్నదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలన బాలికల విద్యకు స్వర్ణయుగంగా మారిందని కొనియాడారు. పీజీ అడ్మిషన్లలో 72%, డిగ్రీలో 52%, గురుకులాలు, కేజీబీవీల్లో 69%, బీఈడీ ఫస్టియర్లో 81% బాలికలే పొందారని, ఉన్నతవిద్యలో బాలికల ఎన్రోల్మెంట్ రేషియోలో జాతీయ సగటును మించి తెలంగాణ ఫలితాలను సాధిస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు.
కొత్త విద్యాసంస్థల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పనతో ఉన్నత విద్యలో బాలికలు పెద్ద ఎత్తున చేరుతుండటం గర్వకారణమని మంగళవారం ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల కేటాయింపులో తెలంగాణ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నా, వైద్యవిద్యలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లక్ష జనాభాకు సగటున 19 ఎంబీబీఎస్ సీట్లు సృష్టించి దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలలను ఏర్పాటు చేసి మెడికల్ సీట్లను పెంచిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ మద్దతు ఏ మాత్రం లేకున్నా రాష్ట్రంలోని ప్రతి ఒకరికీ ఆమోదయోగ్యమైన, అత్యుత్తమ పాలన అందించాలన్న కేసీఆర్ చిత్తశుద్ధి చెప్పుకోతగ్గదని కొనియాడారు.