Telangana | హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభ్యంతరం వ్యక్తంచేశారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలను రికార్డుల్లోంచి తొలగించాలని శాసనమండలిలో కవిత సవరణను ప్రతిపాదిస్తూ మండలి చైర్మన్కు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ‘విముక్తి’, ‘అణచివేత’, ‘నియంతృత్వ పాలన’, ‘వ్యవస్థల విధ్వంసం’, ‘వివక్ష’ వంటి పదాలను తొలగించాలని సవరణను ప్రతిపాదించారు.
శనివారం మండలి మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, ఎమ్మెస్ ప్రభాకర్, తాతా మధు, ఎంసీ కోటిరెడ్డితో కలిసి కవిత మాట్లాడారు. రెండుసార్లు ప్రజలు ఓట్లు వేస్తేనే భారీ మెజారిటీతో గెలిచిన ప్రభుత్వాలమీద విపరీతమైన వ్యాఖ్యలు గవర్నర్ ప్రసంగంలో చేయడం అందరినీ బాధించిందని అన్నారు. మండలిలో బీఆర్ఎస్కే మెజార్టీ ఉన్నప్పటికీ, ప్రభుత్వానికి సహకరించాలని.. తద్వారా ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నర్ ప్రసంగంలో ఉన్న అంశాలకు తాము చేసిన అమెండ్మెంట్ను విత్డ్రా చేసుకున్నామని వివరించారు. తెలంగాణ ప్రజలకు నష్టం జరిగే ఎలాంటి నిర్ణయం జరిగినా కచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని కవిత స్పష్టంచేశారు.