హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అన్నారు. ఇంటిల్లిపాదీ ఏకమై, ఊరువాడ ఒక్కచోట చేరి రంగురంగుల పూలను పేర్చి ఆడబిడ్డలు ఆనందంగా జరుపుకునే ప్రకృతి పండుగని పేర్కొన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే సంబురాలను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా అధికారికంగా ఘనంగా నిర్వహించడం మనందరికీ గర్వకారణమన్నారు.
బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ పుట్టింటి కానుకగా కోటికిపైగా చీరెలను అందిస్తూ మహిళలకు గొప్ప గౌరవాన్ని అందిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రానికే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగను కేవలం మన రాష్ట్రంలోనే గాక, దేశ విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలంతా వారి ప్రాంతంల్లో ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎనిమిది దేశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపేందుకు సంతోషిస్తున్నాన్నారు. దీంతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, ముంబై లాంటి కీలక నగరాల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.