హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): దేశరాజకీయాల్లో బీఆర్ఎస్ గేమ్చేంజర్ కాబోతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమావ్యక్తంచేశారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు అన్ని రంగాల్లో విఫలమయ్యాయని, ప్రాంతీయ పార్టీలు మంచి పనితీరును ప్రదర్శిస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న ఇండియా కూటమి.. ప్రజల కోసం ఏమి చేస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. దక్షిణాదిన బీజేపీకి ఒక సీటు కూడా రాదని తేల్చిచెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని స్పష్టంచేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేసిన పనులు బీజేపీ వంద జన్మలెత్తినా చేయలేదని అన్నారు. చెన్నైలో గురువారం ఏబీపీ నెట్వర్ సంస్థ నిర్వహించిన సదరన్ రైజింగ్ సమ్మిట్లో ‘2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు?’ అంశంపై జరిగిన చర్చా వేదికలో పాల్గొన్న కవిత తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇండియా -ఎన్డీయే కూటములకు బీఆర్ఎస్ సమదూరంగా ఉండటం, తెలంగాణ అభివృద్ధి, బీజేపీ పక్షపాతం వంటి అంశాలపై మాట్లాడారు.
ప్రముఖ రచయిత చేతన్ భగత్ సమన్వయకర్తగా వ్యవవహరించిన ఈ చర్చా గోష్ఠిలో కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై కూడా పాల్గొన్నారు. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు బలమైన శక్తిగా ఎదిగాయని, బీజేపీ, కాంగ్రెస్ కంటే చాలా ప్రాంతీయ పార్టీలు మంచి పనితీరును ప్రదర్శిస్తున్నాయని కవిత తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో పెరిగిన వృద్ధి శాతమే అందుకు నిదర్శనమని అన్నారు. జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు 75 ఏండ్లపాటు పాలించే సమయం లభించినప్పుడు ఏమీ చేయలేదని విమర్శించారు. అందువల్లనే జాతీయస్థాయిలో మరో రాజకీయ శక్తిగా ఎదగాలని తమ పార్టీ భావిస్తున్నదని, తెలంగాణలో తాము ఏమి చేశామో దానిని దేశమంతా విస్తరిస్తామని ప్రకటించారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను అసంతృప్తికిలోను చేశాయని, తమ పార్టీ జాతీయ స్థాయిలో ఏ కూటమిలోనూ ఉండదల్చుకోలేదని తేల్చిచెప్పారు. దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు బలమైన శక్తిగా ఎదిగాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు 75 ఏండ్లపాటు పాలించే సమయం లభించినా ఏమీ చేయలేదు. జాతీయస్థాయిలో మరో రాజకీయ శక్తిగా ఎదగాలని మా పార్టీ భావిస్తున్నది. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇండియా కూటమి పతనం తప్పదు. 2024 ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీకి ఒక సీటు కూడా రాదు.
తృణమూల్ కాంగ్రెస్, బీజేడీ, వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ స్వతంత్రంగా ఎకువ సీట్లు సాధించగలవని కవిత చెప్పారు. బీఆర్ఎస్ మాత్రమే కాకుండా ఎవరైనా గేమ్ చేంజర్ కావచ్చని అభిప్రాయపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఇండియా కూటమి పతనమవుతుందని, ఆ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పార్టీల అభిప్రాయం మారవచ్చునని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రతి పార్టీ తమ వ్యూహాలపై పునరాలోచన చేస్తాయని, ఇండియా కూటమిలో కొనసాగాలా లేదా స్వతంత్రంగా పోటీ చేయాలా అని ఆలోచన చేస్తాయని అభిప్రాయపడ్డారు.
బీజేపీని గద్దెదించాలన్నది ఇండియా కూ టమి ఏకైక ఎజెండా అని, కానీ ప్రజల కోసం ఆ కూటమి ఎజెండా ఏమిటి? అని కవిత ప్రశ్నించారు. బీజేపీని గద్దెదించడమే ఇండి యా కూటమి లక్ష్యమైతే మరి ప్రస్తుత ప్రభు త్వం కంటే ప్రజలకు వారు ఏం మెరుగైన పనులు చేస్తారని అడిగారు. ‘బెంగాల్లో తృణముల్ కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు కొట్లాడుకుంటాయి, కేరళలో కాంగ్రెస్, సీపీఎం మధ్య పోరు, పంజాబ్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు తలపడుతాయి.. కానీ ఇవన్నీ ఇండియా కూటమిలో ఉన్నాయి. ఇవి సీట్లను ఎలా పంచుకుంటాయి’ అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు స్థాయిలో మూడున్నరేండ్ల కాలంలో పూర్తిచేశామని, 73 లక్షల ఎకరాలకు ఆ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతున్నదని కవిత చెప్పారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ చేసిన పనులను బీజేపీ 100 జన్మలెత్తినా చేయలేదని వ్యాఖ్యానించారు.
మోదీ ప్రభుత్వం అశ్రిత పెట్టుబడిదారి విధానాన్ని ప్రోత్సహించకపోతే రూ.12 లక్షల కోట్ల మేర కార్పొరేట్ల రుణాలను ఎలా రద్దు చేశారని కవిత ప్రశ్నించారు. రైతు రుణమాఫీ గురించి బీజేపీ ఎందుకు మాట్లాడదని నిలదీశారు. కుటుంబపాలన గురించి మాట్లాడే బీజేపీ.. జ్యోతిరాదిత్య సింధియాను కేంద్ర మంత్రిని ఎలా చేసిందని అడిగారు. గతంలో తమిళనాడులో డీఎంకే పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకున్ననాడు, మహారాష్ట్రలో శివసేనతో పొత్తుపెట్టుకున్నప్పుడు అవి కుటుంబ పార్టీలని తెలియదా? అని నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాజీ ముఖ్యమంత్రి కుమార్తె అన్న విషయం బీజేపీకి తెలియదా? అని ప్రశ్నించారు.
బీజేపీ దృష్టిమళ్లింపు రాజకీయాలు చేస్తున్నదని, అవి కొన్నిసార్లు పనిచేశాయని, ఇకపై పనిచేయబోవని కవిత స్పష్టం చేశారు. 2026 తర్వాత జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలు సీట్లు కోల్పోతాయని, దీనిపై బీజేపీ వైఖరి ఏమిటని ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలైని ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాలు రాజకీయ ప్రాతినిధ్యాన్ని కోల్పోడానికి సిద్ధంగాలేవని తేల్చిచెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇష్టమున్న రాష్ట్రాలకే బీజేపీ నిధులు ఇస్తున్నదని, దేశ ప్రజలపై రూ.100 లక్షల కోట్ల రుణభారాన్ని మోపిందని ఆమె ధ్వజమెత్తారు. గతంలో పనిచేసిన ప్రధానమంత్రులంతా కలిసి రూ. 50 లక్షల కోట్ల అప్పులు చేస్తే ఒక మోదీ ప్రభుత్వమే రూ. 100 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. ఇతర దేశాల చొరబాటును అడ్డుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించారని, కానీ చైనా మన భూభాగంలో రోడ్ల వంటి నిర్మాణాలు చేపడుతున్నా కేంద్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
కులగణన చేయాలంటే బీజేపీకి భయమెందుకని కవిత ప్రశ్నించారు. కరోనా వల్ల 2021లో చేపట్టాల్సిన జనగణన వాయిదా పడిన తర్వాత మళ్లీ ఎందుకు చేపట్టడం లేదని అడిగారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో సమగ్ర కుటుంబ సర్వే పేరిట ఒకేరోజున రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేపట్టామని, దానివల్ల అన్ని వర్గాల ప్రజలకు తగిన విధంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని గుర్తుచేశారు. దేశంలో కులగణన జరగకపోవడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సమాన బా ధ్యత వహించాలని అన్నారు. కులగణ న చేపట్టాలని డిమాండ్ చేశారు. మతరాజకీయాలపై ఆమె స్పందిస్తూ.. రాజకీయ హిందువులు, ఆచరించే హిందువులు ఉన్నారని అన్నారు. బీజేపీది రా జకీయ హిందుత్వమని, దక్షిణాది ప్రజ లు ఆచరించే హిందువులని చెప్పారు.