MLC Kavitha | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వంపై, బీఆర్ఎస్పై, ముఖ్యంగా తనపై ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సుకేశ్ చంద్రశేఖర్తో తనకు పరిచయం లేదని, అతనెవరో కూడా తెలియదని చెప్పారు. వాస్తవాలను పట్టించుకోకుండా, కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో పనిగట్టుకొని తప్పుడు వార్తలు ప్రచురించాయని గురువారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో తన మొబైల్ ఫోన్ల విషయంలోనూ తొందరపడి వార్తలు రాసి తరువాత తోక ముడిచాయని గుర్తుచేశారు. ఇప్పుడు క్రిమినల్ సుకేశ్ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ను, ఆయన కుటుంబసభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
బీఆర్ఎస్కు వస్తున్న ప్రజాదరణను, సీఎం కేసీఆర్ జాతీయస్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదురొనే ధైర్యంలేక, తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక నేరగాడు, అనామక లేఖను విడుదల చేయడం, దానిపై వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, తదనంతరమే ఎంపీ అర్వింద్ బీజేపీ టూల్ కిట్లో భాగంగా పనిగట్టుకొని సామాజిక మాధ్యమాల ద్వారా బురదజల్లే కార్యక్రమాన్ని ప్రణాళిక ప్రకారం చేస్తున్నారని దుయ్యబట్టారు. క్రిమినల్ సుఖేశ్ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్ను, ఆయన కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆమె విమర్శించారు. ‘దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కట్టేయమన్న’ చందంగా.. ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్నట్టు తయారైన కొన్ని మీడియా సంస్థల తీరు అత్యంత దురదృష్టకరం అని పేర్కొన్నారు. పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఎజెండాలో మీడియా సంస్థలు పావుగా మారడం, బీఆర్ఎస్పై అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేయడం చూస్తే ఎన్నికల ఏడాదిలో మరెంతో దిగజారి వార్తలు ప్రసారం చేస్తారనే విషయాన్ని తెలంగాణ సమాజం గ్రహించాలని సూచించారు.
తెలంగాణ ప్రజలు విజ్ఞులు అని..పాలు ఏవో, నీళ్లు ఏవో తెలిసిన చైతన్య జీవులని పేర్కొన్నారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని, కేసీఆర్పై కక్షతో అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలో ముందు వరుసలో నిలిపిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఈర్శ్యతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని తెలంగాణ సమాజం తప్పకుండా తరిమి కొడుతుందని స్పష్టంచేశారు. తనపై బురద జల్లే వార్తలకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చిన కొన్ని మీడియా సంస్థలు.. దమ్ముంటే, నిజాయితీ ఉంటే తన వివరణకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బిడ్డలం ఎన్నటికీ తలవంచమని, తెగించి కొట్లాడుతామని ఆమె స్పష్టం చేశారు.