నిజామాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): విభజన చట్టంలోని హామీలపై నిర్ణయం ప్రకటించాకే ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్కు రూ.42 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించిన మోదీ.. తెలంగాణను ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, నిజామాబాద్లో పసుపుబోర్డు ఏర్పాటు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సహా విభజన చట్టంలోని హామీలపై తేల్చాకే తెలంగాణ గడ్డపై అడుగు పెట్టాల ని సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశా రు. తెలంగాణలో కాంగ్రెస్కు స్థానం లేదని అన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామంటూ రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలను కొట్టిపడేశారు. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసి, ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురిచేసిన కాంగ్రెస్.. తెలంగాణలో గెలుస్తామంటే ఏడవాలో, నవ్వాలో అర్థం కావట్లేదన్నారు. ఎన్నికల ఫలితాల రోజున రాహుల్గాంధీని తెలంగాణకు ఆహ్వానిస్తున్నట్టు చెప్పా రు. పార్లమెంట్లో మహిళా బిల్లు ఆమోదం పొందిన తర్వాత తొలిసారి సోమవారం నిజామాబాద్కు వచ్చిన కవితకు బీఆర్ఎస్ శ్రేణు లు ఘనంగా స్వాగతం పలికాయి. బిల్లు కోసం కవిత చేసిన పోరాటాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. నగర అభివృద్ధికి రూ.60 కోట్లు విడుదల చేసిన కేటీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో శ్రేణులనుద్దేశించి ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ల తీరును ఎండగట్టారు.
మహిళా బిల్లు సాధించిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టంచేశారు. ఈ విషయంపై బీఆర్ఎస్ ఆది నుంచి పోరాటం చేసిందని, సీఎం కేసీఆర్ అనేకమార్లు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారని గుర్తుచేశారు. ప్రపంచంలో మిగిలిన దేశాల సరసన తలెత్తుకుని భారత్ నిలబడిందంటే అందుకు బీఆర్ఎస్ కారణమని చెప్పారు. 2014, 2019లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఎనాడూ మహిళా బిల్లుపై ఊసెత్తలేదని మండిపడ్డారు. ప్రస్తుత మహిళా బిల్లు పోస్టు డేటెడ్ చెక్కువంటిందని, వెంటనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆడబిడ్డలు గుండె మీద చేయి వేసుకుని ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కవిత చెప్పారు. గతంలో ఎవరైనా ఎమ్మెల్యేలు గల్లీల్లో తిరిగి మీ సమస్యలు తెలుసుకున్నారా? ఎవరైనా ఎక్కడైనా గర్భిణి ఉన్న ఇంటికే వచ్చి అంబులెన్సులో ఎక్కించుకుని దవాఖానకు తీసుకెళ్లి బాగోగులు చూసిన దాఖలాలు గతంలో ఉన్నాయా? ఇదంతా కేసీఆర్ వల్లే సాధ్యమైంది కదా? అని కవిత అన్నారు. ప్రజలంటే ప్రేమ, అభిమానం ఉన్న నాయకులను, మర్యాద ఉన్న నాయకులను కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. మార్కెట్ కమిటీల్లో ఎన్న డూ మహిళలకు పదవులు లేవని, కేసీఆర్ మాత్రం పదవులు కట్టబెట్టారని చెప్పారు. నిజామాబాద్లో మంజుల అనే దళిత మహిళను రైతుబంధు సమితి అధ్యక్షురాలిని చేసినట్టు గుర్తుచేశారు. నిజామాబాద్లో జాబ్మేళాలతో యువతకు భారీగా ఉద్యోగాలు కల్పించినట్టు చెప్పారు. నగర అభివృద్ధికి రూ.60 కోట్లు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు, మేయర్ నీతూకిరణ్, టీఎస్డబ్ల్యూఎఫ్సీ చైర్మన్ ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు.
ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ఇప్పుడు మాట్లాడుతున్నదని, 20 ఏండ్ల కింద కాంగ్రెస్కు ఆ తెలివే ఉంటే అప్పుడే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు న్యాయం జరుగుండేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీజేపీ కంటే ముందు కాంగ్రెస్సే దేశాన్ని పాలించిందని, వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీ కోటాపై సోయి లేదా అని ప్రశ్నించారు. అధికారం కోల్పోతేనే కాంగ్రెస్కు బీసీలు గుర్తుకు వస్తారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తన చిరకాల కల అంటూ సోనియాగాంధీ చెప్పడాన్ని కవిత ఎద్దేవాచేశారు. ‘ప్రజల కోసం కల కనాలంటే అభివృద్ధిని కోరుకోవాలి. అలాంటి అభివృద్ధి గడిచిన కాలంలో తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే సాధ్యమైంది. ముస్లింలు, దళితులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాల వారికి తెలంగాణలో కేసీఆర్ పరిపాలన ద్వారా పెద్దపీట దక్కింది. ఇదీ కేసీఆర్ కల’ అని అభివర్ణించారు. తెలంగాణలో కేసీఆర్ మూలంగా శాంతి, భద్రత ఉంటడం వల్లే పరిశ్రమలు తరలి వస్తున్నాయని, తద్వారా ఉపాధి దక్కుతోందని చెప్పారు.