హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కక్ష కట్టి, వివక్ష చూపుతూ, రాష్ర్టానికి అదనంగా ఒక్క పైసా నిధులు కేటాయించలేదని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడి యం శ్రీహరి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ర్టాని కి అన్యాయం జరుగుతున్నా.. రాష్ట్ర బీజేపీ నేతలు దద్దమ్మలు, చవటల్లాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మునుగోడులో రాజగోపాల్రెడ్డికి రాజకీయ సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. సోమవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రా వు, ఎమ్మెల్సీలు వీ గంగాధర్గౌడ్, యెగ్గె మల్లేశంతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెచ్చేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు కృషి చేయడం లేదని దుయ్యబట్టారు. రాష్ర్టానికి కేంద్రం ఇచ్చి న హామీలను అమలు చేయించాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నేతలకు లేదా? అని ప్రశ్నించారు. బయ్యారంలో ఉకు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అంటారా? తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బండి సంజయ్ ఏం చేస్తున్నారు? అని నిలదీశారు.
బీజేపీ పేదల శత్రువు
బీజేపీ పేద, బడుగు, బలహీనవర్గాల శత్రువు అని, ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని కడియం శ్రీహరి పేర్కొన్నారు. రిజర్వేషన్లు, సబ్సిడీలు ఎత్తివేసేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ప్రశ్నించేవారిని అర్బన్ నక్సలైట్లుగా ముద్రవేస్తున్నారని, ప్రత్యర్థి పార్టీల నేతలను ఈడీ, సీబీఐలతో వేధిస్తున్నారని, గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదని అన్నారు. మోదీ ప్రభుత్వం ఎనిమిదేండ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందని, ప్రపంచంలో దేశ ప్రతిష్ఠను దిగజార్చిందని మండిపడ్డారు. రూపాయి విలువ పడిపోకుండా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని దుయ్యబట్టారు.
బూరకు రెండుసార్లు అవకాశం: బడుగుల
మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్కు సీఎం కేసీఆర్ వల్లే రాజకీయంగా గుర్తింపు వచ్చిందని.. 2014, 2019లో ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. 2019లో ఎంపీగా ఓడిపోయినా నర్సయ్యకు కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. వెనకబడిన వర్గాలకు టీఆర్ఎస్ ప్రాధాన్యం ఇవ్వడం లేదని బూర చేసిన ఆరోపణలను ఖండించారు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు బీసీలకు కేసీఆర్ అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు. బూర నర్సయ్యగౌడ్ బీజేపీ కుట్రలో పావుగా మారి సీఎం కేసీఆర్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీలో బండి సంజయ్కే దికులేదని, ఆ పార్టీలో బూరను ఎవ్వరు పట్టించుకొంటారని ఎద్దేవా చేశారు.
ముమ్మాటికీ కోవర్టు రెడ్డిలే
కాంగ్రెస్లో ఉంటూ బీజేపీతో టచ్లో ఉన్నానని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారని, దీనిని కోవర్టు కాక మరేం అంటారని కడియం ప్రశ్నించారు. కాంట్రాక్టు దక్కగానే బీజేపీలో చేరినట్టు రాజగోపాల్రెడ్డే అంగీకరించారని గుర్తు చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవన్నీ తెలియవా? తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎన్నికలు జరుగుతుంటే ఆయన ఎందుకు ప్రచారానికి వెళ్లరు? వెంకట్రెడ్డి కోవర్టు కాక మరేమిటి? అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి సోదరులను కోవర్టు సోదరులు అని కేటీఆర్ అనడం ముమ్మాటికీ కరెక్టేనని పేర్కొన్నారు. బీజేపీకి మునుగోడులో ఓటు అడిగే హకు లేదని, టీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పారు.