Kadiyam Srihari | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్తరకుమారుడి వంటివాడని.. ఉత్తమాటలే తప్పా చేసిందేమీ ఉండని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సెటైర్లు వేశారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని శివునిపల్లి గ్రామంలో గిరిజన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కేసీఆర్కు కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, గిరిజనులు పాలాభిషేకం చేశారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లుగా తెలంగాణకు ఏం ఒరగబెట్టావో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. విభజనచట్టంలోని హామీలను నెరవేర్చలేని దద్దమ్మలని, గిరిజన విశ్వవిద్యాలయానికి అనుమతులు వచ్చినా ఇంత వరకు ఏర్పాటు చేయడానికి మనసురావడం లేదన్నారు.
అధికార యావతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గు చేటని కడియం శ్రీహరి దుయ్యబట్టారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అమలు చేయలేని సన్నాసులని పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, అసత్య ప్రచారాలతో విమర్శిస్తున్నారని కడియం అన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణకు ఏం ఒరగబెట్టిందో రేవంత్ రెడ్డి చెప్పాలని కడియం డిమాండ్ చేశారు. గత తొమ్మిదేళ్లుగా కేసీఆర్ పాలనలో తెలంగాణలో 65 లక్షల మందికి రైతుబంధు, 44లక్షల మందికి ఆసరా పెన్షన్లు, 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు, కల్యాణ లక్ష్మి, ఇంటింటికీ మిషన్ భగీరథ, తదితర సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల ఆశీర్వాదాలు అందుకుంటున్నామన్నారు. తెలంగాణ సాధించి పదేళ్లు కావస్తుండడంతో ప్రజలతో సంతోషంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటుంటే దగా ఉత్సవాలు అనడం తన అవివేకానికి నిదర్శనం అన్నారు.
తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడమే కాకుండా, అభివృద్ధి చేసి తండాల రూపురేఖలు మార్చామని, తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్, తలసరి వైద్య,ఆరోగ్యంలో తెలంగాణ ముందున్నదని, అధికారం కోసం అనవసరపు విమర్శలు సరివకావన్నారు. తెలంగాణను సాధించిన పదేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకుని సాగునీటి సమస్యను పరిష్కరించుకోవడమే కాకుండా, ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కాదా? అని ప్రశ్నించారు. ఇవన్నీ కనిపించని రేవంత్ రెడ్డి దగుల్బాజీ మాటలు మాట్లాడవద్దని కడియం హితవు పలికారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బెలిదె వెంకన్న, బానోత్ రాజేశ్నాయక్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీల గట్టయ్య, మాజీ జడ్పీటీసీ స్వామినాయక్, చిల్పూర్ వైస్ ఎంపీపీ భూక్యా సరిత తదితరులు పాల్గొన్నారు.