హనుమకొండ: కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర చేస్తున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలపై వివక్ష చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం వైఖరి అసమానతలను పెంచేలా ఉన్నదని ఫైరయ్యారు. దళిత మేధావులు, ప్రజాస్వామ్య వాదులు అప్రమత్తమవ్వాలని సూచించారు. హనుకొండలో ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్తో కలిసి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. కులమతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతున్నదని ఆరోపించారు. 1961 నుంచి 2021 వరకు ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను పెంచలేదని వెల్లడించారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడాలేనివిధంగా రాష్ట్రంలో దళితబంధు, గిరిజన బంధు అమలుచేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ మోడల్గా దేశవ్యాప్తంగా దళిత, గిరిజన బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.