స్టేషన్ ఘన్పూర్, జూన్ 18: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉత్తర కుమారుడని, మాటలు తప్ప చేసేది ఏమీ ఉండదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని శివునిపల్లి గ్రామంలో గిరిజన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కడియం మాట్లాడుతూ.. తొమ్మిదేండ్లుగా తెలంగాణకు ఏం ఒరగబెట్టావో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేని దద్దమ్మ అని మండిపడ్డారు.
గిరిజన యూనివర్సిటీకి అనుమతులు వచ్చినా ఏర్పాటు చేయడానికి మనసు రావడం లేదని విమర్శించారు. అధికార యావతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలతో విమర్శిస్తున్నారని కడియం ధ్వజమెత్తారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణకు ఏం ఒరగబెట్టిందో రేవంత్రెడ్డి చెప్పాలని కడియం డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.