జఫర్గఢ్, అక్టోబర్ 2 : తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టాభివృద్ధి కోసం ఒరగబెట్టిందేమీ లేదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తమ్మడపల్లి(ఐ)లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన హామీలను నెరవేర్చడంలో మోదీ సర్కారు విఫలమైందని, ఇదొక దద్దమ్మ ప్రభుత్వమని మండిపడ్డారు. విభజన హామీల అమలుకు కృషిచేయని తెలంగాణలోని బీజేపీ నేతలు చవటలు, సన్నాసులని పేర్కొన్నారు.
తెలంగాణ అభివృద్ధికి పాటుపడని.. ఉచితాలు వద్దు, సంక్షేమ పథకాలను రద్దు చేయాలన్న కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలోని బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు రూ.12 లక్షల కోట్లను మాఫీ చేసిన ఘనత బీజేపీ సర్కారుకే దక్కిందని ఎద్దేవా చేశారు. బడా పారిశ్రామికవేత్తలకు ఇష్టమొచ్చినట్టు లక్షల కోట్లు మాఫీ చేయడం నరేంద్ర మోదీ జాగీరు కాదన్నారు. ఈ ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో దేశం ఆర్థికంగా వెనుకబడిందని ఆందోళన వ్యక్తంచేశారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ చలి మంటలను కాచుకునేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కడియం మండిపడ్డారు.