హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనమండలిలో ఖాళీ అయిన రెండు సీట్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ గురువారం షెడ్యూల్ ప్రకటించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీచేసిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్రెడ్డి గెలుపొందారు. దీంతో వీరిద్దరూ శాసనమండలికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వీరి స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం ఈ నెల 29న పోలింగ్ నిర్వహించనుంది. ముందుగా జనవరి 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. జనవరి 18న నామినేషన్ల గడవు ముగుస్తుంది. జనవరి 19న నామినేషన్లను పరిశీలించనుండగా.. ఉపసంహరణకు 22వ తేదీని గడవుగా నిర్ణయించారు. పోలింగ్ 29న ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం అయిదు గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం ఫిబ్రవరి ఒకటో తేదీనాటికి పూర్తిచేయాలని ఎన్నికల సంఘం పేర్కొన్నది.
బీఆర్ఎస్, కాంగ్రెస్లకు చెరొకటి..?
శాసనమండలిలో రెండు స్థానాలకు జరుగనున్న ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. రెండు స్థానాలను గెలుచుకొనేంత బలం అధికార కాంగ్రెస్ పార్టీకి లేదు. ప్రస్తుతం శాసనసభలో ఉన్న బలాబలాల ప్రకారం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో స్థానం గెలుచుకొనే అవకాశం ఉన్నదని విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ పోటీ అనివార్యమైతే ఒక్కో స్థానం గెలువడానికి కనీసం 40.6 ఓట్ల చొప్పున కావాలి. రెండు స్థానాలు గెలువడానికి 81.2 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. కానీ కాంగ్రెస్కు 65 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీఆర్ఎస్కు ఎంఐఎం సహకరించే అవకాశాలున్నాయి. అప్పుడు బీఆర్ఎస్ కచ్చితంగా ఒక స్థానాన్ని గెలుచుకోవచ్చు. బీజేపీ కూడా అభ్యర్థిని బరిలోకి దింపితే ఎన్నికల ప్రక్రియ మరింత సులువుగా పూర్తవుతుంది. అప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందుతారు. బీజేపీ పోటీకి దిగకుండా పోలింగ్కు గైర్హాజరైతే అప్పుడు బరిలో నిలిచిన అభ్యర్థికి 38 ఓట్లు సరిపోతాయి. ఇక ఎంఐఎం కూడా గైర్హాజరైతే ఒక్కో అభ్యర్థికి 36 ఓట్లు వస్తే సరిపోతుంది. బీజేపీ, ఎంఐఎంలు కాంగ్రెస్కు సహకరించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చెరొక స్థానాన్ని గెల్చుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
కాంగ్రెస్ నుంచి ఆశావహులు ఎందరో
ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో కాంగ్రెస్ పార్టీలో చాలామందికి కొత్త ఆశలు చిగురించాయి. శాసనసభ ఎన్నికల్లో పోటీచేసి ఓడినవారు, టికెట్ దక్కనివారు, సీఎం రేవంత్రెడ్డి ప్రధాన అనుచరులు టికెట్ను ఆశించేవారి జాబితాలో ఉన్నారు. ప్రధానంగా షబ్బీర్ అలీ తనకే ఎమ్మెల్సీ టికెట్ దక్కుతుందని, తాను గెలిస్తే మంత్రివర్గంలో కూడా చేరుతానని ధీమాతో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం లేకపోవటంతో కచ్చితంగా తనకే ఎమ్మెల్సీ టికెట్ దక్కుతుందని అంజన్కుమార్ యాదవ్ భావిస్తున్నారు. మైనంపల్లి హన్మంతరావు, ఫిరోజ్ఖాన్, హరికర వేణుగోపాల్, సీఎం రేవంత్రెడ్డి వెన్నంటి ఉన్న అద్దంకి దయాకర్, వేం నరేందర్రెడ్డి కూడా ఆశావహుల్లో ఉన్నారు. సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీని నమ్ముకొని ఉన్నానని, తెలంగాణలో పార్టీ విజయం సాధించేందుకు తానుకూడా కష్టపడ్డానని చెప్తున్నారు. యువజన కాంగ్రెస్ కోటాలో తనకు సీటు ఇస్తారని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆశాభావంతో ఉన్నారు.
బీఆర్ఎస్ నుంచి ఎవరు..?
బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్సుకత నెలకొన్నది. అయితే, ప్రస్తుతం లోక్సభ నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షలు నడుస్తుండటం, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుండటంతో ఎవరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారన్నది ఇంకా తేలలేదు. అయితే, పార్టీ కోసం కష్టపడిపనిచేసిన వారికి అవకాశం ఇస్తారని, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నందున ప్రజాసమస్యలను బలంగా వినిపించేవారికి, సామాజిక సమతూకం ఉండేలా నిర్ణయం ఉంటుందని నేతలు చెప్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థి ఎవరనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.