Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. అబద్దాలు, మోసాల పునాదుల మీద రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ సర్కార్ మళ్లీ మోసం చేసిందని విమర్శించారు. కేసీఆర్ రూ.8లక్షల కోట్ల అప్పు చేశారని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. సీఎం కాకముందు నుంచే దుష్ప్రచారం చేస్తూ తన నైజాన్ని రేవంత్ రెడ్డి బయట పెట్టారని అన్నారు. రూ.3.47 లక్షల కోట్ల అప్పు తెచ్చానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ప్రస్తావించారు. రూ.3.30 లక్షల కోట్లు అప్పు కట్టానని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పారని అన్నారు. ప్రభుత్వం కట్టిన అప్పు లక్షా 67 వేల కోట్ల అప్పు మాత్రమే నని స్పష్టం చేశారు.
కేసీఆర్ను బద్నాం చేసేందుకు అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడుతున్నారని దాసోజు శ్రవణ్ విమర్శించారు. గవర్నర్ ప్రసంగం అబద్ధం అని నేను మండలిలో మాట్లాడితే అభ్యంతరం తెలిపారని అన్నారు. అసెంబ్లీలో సీఎం అబద్దాలు మాట్లాడితే ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలని అన్నారు. బడ్జెట్తో చీట్ చేసే సీఎం ఎక్కడైనా ఉంటారా అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలపై కేటీఆర్ ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశ పెట్టనున్నారని తెలిపారు. ఈ బిల్లుకు సభ్యులు మద్దతు ఇవ్వాలని కోరారు.
బడ్జెట్లో 2026-27లో విద్యా శాఖకు నిధుల కేటాయింపులు తగ్గాయని దాసోజు శ్రవణ్ తెలిపారు. కేవలం 8 శాతం మాత్రమే నిధులు కేటాయించారని తెలిపారు. దీనిపై విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో పాటు సభ్యులు స్పందించాలని కోరారు. విద్యా శాఖను సీఎం భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు.