హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తేతెలంగాణ): ‘బాపూ పేరిట సీఎం రేవంత్రెడ్డి బుల్డోజర్ల రాజ్యం నడుపుతున్నడు..ఆయన నిరంకుశత్వం పరాకాష్టకు చేరింది. వెంటనే జోక్యం చేసుకొని ఆయన చర్యలను నిలువరించండి’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు గురువారం ఆయనకు బహిరంగలేఖ రాశారు. గాంధీ పేరుతో తెలంగాణ కట్టడాల వ్యామోహం ముసుగులో పేదవాడి గూడును చెడగొడుతున్నారని మండిపడ్డారు. ‘ఒకవైపు మీరు భారత్ జోడో అభియాన్ ద్వారా మొహబ్బత్ కీ దుకాణ్ అంటూ దేశాన్ని ఏకం చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. తెలంగాణలో రేవంత్ సర్కార్ ఆ విలువలకు పాతరేస్తున్నది.
మూసీ తీరాన రూ.5 వేల కోట్లు వెచ్చించి 500 అడుగుల గాంధీ విగ్రహ నిర్మాణానికి చేపట్టిన గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజల ఇండ్ల సమాధులపై నిర్మించే స్మారక చిహ్నంలా మారబోతున్నది’అని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ అంటే రేవంత్రెడ్డి దృష్టిలో పేదల జీవితాలను బలిపీఠం ఎక్కించడమేనా? అని ప్రశ్నించారు. తన రాజకీయ, ఆర్థిక ఎదుగుదల కోసం సామాన్యుల జీవించే హక్కును కాలరాయడం దారుణమని దుయ్యబట్టారు. గాంధీ కుటుంబం కోసం రాష్ట్ర యూనిట్ రూ.1,000 కోట్లు వసూలు చేయగలదని రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను విస్మయానికి గురిచేసిందని తెలిపారు.
తనకు విగ్రహాలంటే గిట్టదని హరిజన్ పత్రికలో 1939లో గాంధీ రాసిన మాటలను ఉటంకిస్తూ.. తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ అందుకు విరుద్ధంగా వ్యవహరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. గాంధీ బొమ్మను చూపిస్తూ పేదలను నిరాశ్రయులను చేసేందుకు రేవంత్ సర్కార్ కంకణం కట్టుకున్నదని విమర్శించారు. గాంధీ విగ్రహంపై రేవంత్రెడ్డికి ఉన్నది భక్తి కాదని, దాని వెనుక కార్పొరేట్ ప్రయోజనాలే ఉన్నాయని పేర్కొన్నారు. రాహుల్గాంధీ వెంటనే జోక్యం చేసుకొని తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.