హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేది సీఎం కేసీఆర్ సర్కారేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టంచేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో మంత్రి కేటీఆర్కు ఎటువంటి సంబంధం లేదన్నారు. లీకేజీ కా వడం దురదృష్టకర పరిణామమని చెప్పారు. దోషులు ఎంతటివారైనా తప్పించుకోలేరన్నా రు. దేశ చరిత్రలో పార్లమెంట్ సమావేశాలు ఇలా స్తంభించిన దాఖలాలు లేవని, అయినా కేంద్రానికి ప్రజాసమస్యలపై పట్టింపులేకపోవడం దురదృష్టకరమని అన్నారు. గురువారం శాసనమండలిలోని తన చాంబర్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
ప్రతిభకే సీఎం పట్టం
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా, పూర్తిగా ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమని గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. ‘పూర్తి ‘ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలి. నియామక ప్రక్రియలో ఎవరి ప్రమేయమూ ఉండకూడదు. చదువుకున్నవాళ్లు, సమర్థులకు ఉద్యోగాలు రావాలి. గ్రూప్- 1లో ఇంట ర్వ్యూ విధానాన్ని తీసేస్తే సమర్థులకు న్యాయం జరుగుతుంది’ అని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డితో సీఎం కేసీఆర్ చెబుతున్న సమయం లో తాను యాదృచ్ఛికంగా అక్కడే ఉన్నానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ లీకేజీతో మం త్రి కేటీఆర్కు ఏం సంబంధం అని ప్రశ్నించా రు. ఎక్కడో నైజీరియాలో కూర్చొని మన బ్యాంకు ఖాతాల్లోంచి సొమ్మును కొట్టేస్తున్న సైబర్ నేరాలకు ఐటీ మంత్రిగా కేటీఆర్ బాధ్య త వహించాలంటే ఎలా ఉంటుందో.. ఈ లీకేజీని ఆయనకు అంటగట్టడం కూడా అలాగే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన పనిలేదన్నారు.
రాజకీయ ఉనికి కోసం ఆ పార్టీల పోటీ
తమ రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్, బీజేపీలు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని వాడుకుంటున్నాయని గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఉద్యోగార్థులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని, ఒకవైపు సిట్ విచారణను కొనసాగిస్తూనే మరోవైపు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్లు ఎంత గొంతు చించుకొంటున్నా ప్రజలు నమ్మటం లేదన్నారు. రాష్ట్రంలో మూడోసారి సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడకుండా ఏ శక్తి ఆపలేదని తేల్చిచెప్పారు. ద్వితీయ స్థానం ఎవరిదో ఆ రెండు పార్టీలే తేల్చుకోవాలన్నారు.
గవర్నర్ల వ్యవస్థ సరిగా లేదు
కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష, పరోక్ష ప్రోత్సాహంతో గవర్నర్ల వ్యవస్థకు భంగం వాటిల్లుతున్నదని గుత్తా ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో గవర్నర్లు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. శాసనమండలి, శాసనసభ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా నెలలతరబడి గవర్నర్లు తొక్కి పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టేనని విమర్శించారు. బిల్లులపై ఏవైనా అభ్యంతరాలుంటే చెప్పాలే తప్పా, వాటిని పెండింగ్లో ఉంచటం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.