నల్లగొండ, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్రలు చేస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వనరులను నియంత్రించడం ద్వారా అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు. శుక్రవారం నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఎనిమిదేండ్లలో తెలంగాణను దేశంలోనే నంబర్వన్ రాష్ట్రంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారన్నారు. దీన్ని జీర్ణించుకోలేని మోదీ సర్కార్ తెలంగాణపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నదని మండిపడ్డారు.
ఆర్థిక వనరులను నియంత్రించడం ఫెడరల్ వ్యవస్థకే విఘాతమని పేర్కొన్నారు. ఓ వైపు తెలంగాణ అభివృద్ధి కుంటుపడేలా కుట్రలు చేస్తూ మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటున్నదని చెప్పారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలహీన పర్చాలన్న దురుద్దేశంతో రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని దుయ్యబట్టారు. ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగిస్తూ టీఆర్ఎస్ నేతలను ఇబ్బందులకు గురిచేయాలనుకోవడం సరికాదన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత అప్రజాస్వామిక పద్ధతులను అవలంబించలేదన్నారు. తెలంగాణపై కేంద్రానికి ప్రేమ ఉంటే విభజన సమస్యలు పరిష్కరించాలని, జాతీయ ప్రాజెక్టులకు నిధులివ్వాలని, జీఎస్టీలో రాష్ర్టానికి రావాల్సిన వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ర్టానికి రావాల్సిన సుమారు 40 వేల కోట్లను అడ్డుకుంటూ సంక్షేమ కార్యక్రమాలకు మోకాలడ్డుతున్నదన్నారు.