నల్లగొండ ప్రతినిధి, మే 7 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసికట్టుగా బీఆర్ఎస్ ఓటమికి కుట్రలు చేస్తున్నాయని మాజీ మంత్రులు జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్ విమర్శించారు. మంగళవారం నల్లగొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి రాకేశ్రెడ్డి నామినేషన్ వేసిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్రెడ్డి గెలుపు కోసం మోదీ సహకరించగా, ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో మోదీని గెలిపించేందుకు రేవంత్రెడ్డి పాట్లు పడుతున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ గెలుపును అడ్డుకునేందుకు ఇరు పార్టీల వారు ఒక్కటయ్యారని విమర్శించారు.
ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో ఒకరు దేవుళ్లపై ఒట్లు వేస్తున్నారని, మరొకరు దేవుళ్ల పేరు మీద ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. గోదావరి జలాలను తరలించుకుపోవాలని మోదీ కుట్రలు చేస్తున్నారని, ఇలాంటి కుట్రలను ఆపే దమ్ము ఒక్క కేసీఆర్కే ఉన్నదని సూచించారు. సాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పగించాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం నల్లగొండ వేదికగా లక్ష మందితో కేసీఆర్ గర్జిస్తే వణికిపోయిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నాలుగుసార్లు బీఆర్ఎస్సే విజయం సాధించిందని, ఇప్పుడు కూడా గులాబీ జెండా ఎగురవేసేందుకు అందరం కంకణబద్దులం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాద వ్, జడ్పీ చైర్మన్లు ఎలిమినేటి సందీప్రెడ్డి, గుజ్జ దీపిక, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, గాదరి కిశోర్కుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కంచర్ల భూపాల్రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్, బూడిద భిక్షమయ్యగౌడ్, తిప్పన విజయసింహారెడ్డి, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, రాష్ట్ర నేతలు ఒంటెద్దు నర్సింహారెడ్డి, చెరుకు సుధాకర్, పాల్వాయి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి నామినేషన్ వేశారు. మంగళవారం నల్లగొండలో జరిగిన ఈ కార్యక్రమానికి మూడు ఉమ్మడి జిల్లాల నుంచి మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వందల మందితో ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రులు జగదీశ్రెడ్డి, సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి వెంట రాకేశ్రెడ్డి నామినేషన్ పత్రాలను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి అందజేశారు.