హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ వ్యవస్థలపై తమకు అపారమైన విశ్వాసం ఉన్నదని, అయితే కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలతోనే వాటిపై అనుమానాలు కలుగుతున్నాయని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చెప్పారు. బాధ్యతాయుతమైన కేంద్రమంత్రి హోదాలో ఉండి కిషన్రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర కేసులో బీజేపీ నేతలు నార్కో అనాలిసిస్, లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా? అంటూ మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్పై కిషన్రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూడున్నరేండ్లుగా సికింద్రాబాద్ నియోజకవర్గానికి కిషన్రెడ్డి ఏమి చేశారో చెప్పాలని నిలదీశారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి సీఎం కేసీఆర్పై బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండపడ్డారు.
బీజేపీ నేతలు కోర్టుకు ఎందుకెళ్లారు?
సిట్ విషయంలో కిషన్రెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర పోలీసు వ్యవస్థ మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని తలసాని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు చెప్పిందే కానీ, ఆరోపణలను కొట్టివేయలేదన్న కనీస అవగాహన కిషన్రెడ్డికి లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగులోకి రాగానే ఆ కేసుతో బీజేపీకి ఏమి సంబంధమంటూ ప్రకటనలు చేసిన నాయకులు అనేక దశల్లో కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసును సీబీఐకి అప్పగించాలని కోర్టు తీర్పు ఇవ్వగానే బీజేపీ సంబురాలెందుకు చేసుకున్నదని ప్రశ్నించారు. కిషన్రెడ్డి వ్యాఖ్యలను బట్టి ఈ కేసును బీజేపీ తమకు అనుకూలంగా మలచుకుంటుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.
అభివృద్ధిలో పోటీపడాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి, సంక్షేమం, ప్రజా ప్రయోజనాల కోసం పోటీపడాలే కానీ చిల్లర, దిగజారుడు రాజకీయాల్లో పోటీ పడొద్దని మంత్రి తలసాని కేంద్రమంత్రి కిషన్రెడ్డికి హితవు చెప్పారు. కిషన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేయడం తప్ప కేంద్రం నుంచి రాష్ర్టానికి పనికి వచ్చేది ఏదీ చేయలేదని ప్రజలే విమర్శిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ను ప్రపంచ ప్రఖ్యాత నగరాల సరసన చేర్చిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్దేనని వివరించారు. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ పాలనపై ప్రశంసలు వస్తున్నా బీజేపీ నేతలకు కండ్లు కనిపించవు.. చెవులు వినిపించవని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, తప్పుచేసిన వాళ్లకు ప్రజాకోర్టులోనే శిక్ష పడుతుందని చెప్పారు. కేంద్రంలో బీజేపీకి అధికారం శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, భూపాల్రెడ్డి పాల్గొన్నారు.