BL Santosh | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో వెలిసిన వాల్పోస్టర్లు బీజేపీని మరోసారి ఇరుకున పెట్టాయి. బీజేపీ నాయకుడు బీఎల్ సంతోష్ కనబడుట లేదు.. అని నగరంలోని వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి.
‘ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు’ కనపడుట లేదు.. పట్టిచ్చిన వారికి రూ.15 లక్షల బహుమానం.. అని ఉన్న ఆ పోస్టర్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వీటిని నగరవాసులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలులో బీఎల్ సంతోష్ కీలక వ్యక్తి అని అందరూ చర్చించుకోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వ అండతో విచారణ నుంచి తప్పించుకున్న వ్యక్తి ఇతడేనని పోస్టర్లను చూపుతూ మాట్లాడుకుంటున్నారు.