BRS | జనగామ, జనవరి 26 (నమస్తే తెలంగాణ): అధికారమే లక్ష్యంగా ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్రెడ్డి, కొందరు మంత్రులు స్థాయి మరిచిపోయి అహంకారంతో రెచ్చిపోయి మాట్లాడుతున్నారని స్టేషన్ఘన్పూర్, జనగామ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం జనగామలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రినని మరిచిపోయి కేసీఆర్ను చార్లెస్ శోభరాజ్ అని, కేటీఆర్, హరీశ్రావును బిల్లా రంగా అంటూ బీఆర్ఎస్ను బెదిరించే ధోరణితో మాట్లాడుతున్నారని అన్నారు. ‘శోభరాజ్, బిల్లారంగాల కన్నా నీ చరిత్ర గొప్పది రేవంత్? నువ్వు ఎన్ని కేసుల్లో ఉన్నావో తెలియదా?’ అని వారు ప్రశ్నించారు.
వివిధ డిక్లరేషన్ల ద్వారా 420 హామీలు ఇచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి 50 రోజులు దగ్గర పడుతున్న అంశాన్ని గుర్తుచేస్తే సీఎం, మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారని అన్నారు. రైతులు బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షల పంట రుణం తీసుకోండి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం రుణమాఫీ ఫైల్పై పెడుతానని చెప్పినా.. ఈ రోజు వరకు రైతుబంధు పూర్తిగా రాని సంగతి ఏమైందని వారు ప్రశ్నించారు. నెపాన్ని బీఆర్ఎస్పై నెట్టాలని చూడటం సరికాదని అన్నారు. ఆర్థిక వ్యవస్థ అనుమతించని రీతిలో ఇచ్చిన 420 హామీలు, అత్యుత్సాహంతో ప్రకటించిన తేదీలను పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వరకు కాలయాపన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ను వేధించడమే పనిగా పెట్టుకోకుండా ముందు హామీలను అమలుపై మేథోమథనం చేయాలని వారు సూచించారు. ‘మీ బెదిరింపులకు మేం భయపడేది లేదు. అది జరగని పని’ అని వారు పేర్కొన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా బీజేపీ నాయకురాలిగా ప్రసంగించడం శోచనీయమని ఎమ్మెల్యేలు కడియం, పల్లా అన్నారు. గవర్నర్ అనే సంగతి, రాజ్యాంగ వ్యవస్థను కాపాడాలన్న విషయాన్ని మరిచిపోయి కాషాయ పార్టీ ప్రతినిధిగా గత ప్రభుత్వం గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం సరికాదని సూచించారు. ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ర్టానికి గవర్నరే అధిపతి అన్న సంగతి ఆమె మరిచారని, గత ప్రభుత్వం చేసిన తప్పులకు, ఈ ప్రభుత్వం చేసే తప్పులకు గవర్నర్ బాధ్యులని, తప్పులు అంగీకరించడమంటే అది గవర్నర్ బలహీనత అన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు.
గవర్నర్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, తెలంగాణ మేధావులు దీనిపై స్పందించాలని పిలుపునిచ్చారు. ‘రాజ్యాంగ పరిరక్షణ గవర్నర్ బాధ్యత. కనీస పరిజ్ఞానం, రాజ్యాంగం పట్ల గౌరవం లేని వారిని తీసుకొచ్చి పదవిలో కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది. ఇకపై ఇలాంటివి మానుకోవాలి’ అని వారు గవర్నర్కు సూచించారు. గవర్నర్ కోటాలో కోదండరాంను ఎమ్మెల్సీగా అనుమతించిన గవర్నర్ దాసోజు శ్రవణ్ విషయంలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఇద్దరూ తెలంగాణ ఉద్యమకారులే, యూనివర్సిటీలో పనిచేసిన వారేనని, దాసోజు ఇంటలెక్చువల్ కాకుండా కోదండరాం ఎలా అయ్యారని ప్రశ్నించారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అయినట్టు అర్థమైందని, గవర్నర్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నట్టు వారు ఆరోపించారు.