హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చే రైతులను అభినందించి ప్రోత్సహించాలని మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఆయన మాట్లాడుతూ.. కోతలను బట్టి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు. ఇప్పటివరకు 3,028 కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. ధాన్యం తూకం పక్కాగా చేపట్టాలని, రైతులకు నష్టం చేయొద్దని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వరి కోతలు పూర్తయ్యాక కొయ్యను కాల్చకుండా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వానకాలం సాగులో పత్తి, కంది సాగును పెంచాలని, ధాన్యంలో సన్నరకాల సాగును చేపట్టాలని రైతులకు విజ్ఞప్తిచేశారు.
తేమ, తాలు పేరుతో ఇబ్బంది పెట్టొద్దు :మారెడ్డి
తాలు, తేమ పేరుతో అడ్డగోలుగా తరుగుతీస్తున్న మిల్లర్లు, వ్యాపారులపై కఠినచర్యలు తప్పవని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. ఆయా జిల్లాల్లో ధాన్యం తరుగు తీయడంపై విచారణ చేపడుతున్నట్టు ప్రకటించారు. శుక్రవారం ఆయన ధాన్యం కొనుగోలు, సమస్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో ధాన్యం తరుగుపై వస్తున్న ఆరోపణలు, వార్త కథనాలపై విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ఆదేశించారు.