హైదరాబాద్: రాష్ట్రంలో అభివృద్ధి జరుగకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నీ ఉద్దేశపూర్వకమైనవేనని చెప్పారు. తెలంగాణ పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలన్నీ మంచి ఫలితాలిస్తున్నాయని చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ఎమ్మెల్యే వివేకానంద శాసనసభలో ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో హైదరాబాద్ మినహా ఏ నగరంలోనూ అభివృద్ధి జరగడం లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి, హైదరాబాద్ ప్రగతిని అడ్డుకునేందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.
రాష్ట్రంలో అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు. ఉభయసభలను ఉద్దేశించిన గవర్నర్ చేసిన ప్రసంగం చాలా స్పష్టంగా ఉందని చెప్పారు. అదానీ లాంటి వాళ్లకు కేంద్రం లబ్ధి చేకూరుస్తున్నదని ఆరోపించారు. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ నాయకత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
కేంద్రం నుంచి రాష్ట్రాభివృద్ధికి సహకారం లభించడం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర బడ్జెట్లో ఊసేలేదని విమర్శించారు. ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనను కేంద్ర పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.