జయశంకర్ భూపాలపల్లి : చేసిన అభివృద్ధిని చూసి ఆదరించాలని, సానుభూతితో ఓటేస్తే అభివృద్ధి ఆగిపోతుందని భూపాపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(MLA Venkataramana Reddy )అన్నారు. మంగళవారం భూపాలపల్లి మండలంలోని కమాలాపూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారానికి హాజరైన ఎమ్మెల్యేకు స్థానికులు డప్పు చప్పుళ్లు, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్గా నిలిచిందన్నారు.
ఇక్కడ అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా అమలు చేయడం లేదన్నారు. ఆరు గ్యారంటీలతో ప్రజలను మభ్య పెట్టడానికి వస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. ఇన్నేండ్లు అధికారంలో ఉండి చేయని అభివృద్ధి ఇప్పుడు ఎలా చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే కష్టాలే మిగులుతాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.