భీమ్గల్, ఏప్రిల్ 15: లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు వస్తుందని, మరో రూపంలో కొత్త సర్కారు ఏర్పడుతుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో సోమవారం నిర్వహించిన లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డితో కలిసి వేముల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. దొంగ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. లోక్సభ ఎన్నికలు ఉన్నప్పుడే హామీలను అమలుచేయని కాంగ్రెస్.. ఎన్నికలు అయిపోయాక పట్టించుకుంటుందా? అని ప్రశ్నించారు.
నష్టాలను భరించడం వల్ల కాదని ఆర్టీసీ చేతులెత్తేసిందని, ఎన్నికల తర్వాత మహిళలకు ఉచిత బస్సు పథకం బంద్ చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ సీఎంగా దిగిపోయే నాటికి రూ.7,500 కోట్లు రాష్ట్ర ఖజానాలో ఉన్నాయని, ఆ డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయని కాంగ్రెస్ను, అహంకారి అయిన బీజేపీ ఎంపీ అర్వింద్ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హామీలను వీడియోల రూపంలో పంపిస్తామని, వాటిపై గ్రామాల్లో చర్చ పెట్టి అధికార పార్టీ తీరును ఎండగట్టాలని సూచించారు. గత ఎన్నికల్లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి కలిసి తమ పార్టీ అభ్యర్థి మధుయాష్కిని ఓడించి, బీజేపీ అభ్యర్థి అర్వింద్ను గెలిపించారని బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు.