వేల్పూర్, ఏప్రిల్ 23: ఎన్నికల్లో ఓట్ల కోసం సీఎం రేవంత్రెడ్డి రైతులకు మాయమాటలు చెబుతున్నాడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. ఎర్రజొన్న బకాయిలు అడిగిన రైతులపై కాల్పులు జరిపింది కాంగ్రెస్ కాదా ? అక్రమంగా కేసులు పెట్టిన చరిత్ర మీది కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.11 కోట్ల ఎర్రజొన్న బకాయిలు చెల్లించి, రైతులపై కాంగ్రెస్ సర్కారు పెట్టిన కేసులను ఎత్తేసిందని స్పష్టం చేశారు. నిజామాబాద్లో సోమవారం జరిగిన సభలో రేవంత్రెడ్డి బీఆర్ఎస్పై చేసిన విమర్శలను ప్రశాంత్రెడ్డి తిప్పికొట్టారు. 50 ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు పసుపుబోర్డు ఇవ్వని కాంగ్రెస్.. ఎన్నికల కోసం కల్లబొల్లి మాటలు మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.
పదేండ్లు అధికారంలో ఉండి పసుపుబోర్డు సాధ్యం కాదని చెప్పిన బీజేపీ కూడా.. రైతుల ఓట్ల కోసం పసుపుబోర్డు ఇచ్చామని ప్రధానమంత్రితో అబద్ధపు ప్రకటన చేయించారని విమర్శించారు. రైతులను అబద్ధాలతో మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. పసుపుబోర్డు కోసం నాలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులను కలిసి వారి నుంచి లేఖలు తెప్పించి, కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది అప్పటి ఎంపీ కవితా కాదా? అని ప్రశ్నించారు. షుగర్ ఫ్యాక్టరీని మూసివేసిందే కాంగ్రెస్ ప్రభుత్వమని, సెప్టెంబర్ 17న తెరిపిస్తానని సీఎం రేవంత్రెడ్డి మాయమాటలు చెప్తున్నాడని విమర్శించారు. అబద్ధాల కాంగ్రెస్, బీజేపీలకు పాడికట్టి సిసలైన రైతు పక్షపాతి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి కేసీఆర్కు వెన్నుదన్నుగా నిలువాలని ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.