హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో గవర్నర్ ప్రసంగం అంతా డొల్ల అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. కొత్తగా వచ్చిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ స్కీమ్ల ప్రస్తావన లేకుండా, కేవలం ఆ పార్టీ స్కామ్ల గురించే గవర్నర్ ప్రసంగం ఉన్నదని ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంతో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. 6 గ్యారెంటీలు, 420 హామీలపై గవర్నర్ ప్రసంగంలో ఊసే లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మహిళలకు ఇస్తామని చెప్పిన రూ.2,500 ఏమైంది? అని ప్రశ్నించారు. రైతులు, నిరుద్యోగులు, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల గురించి ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని గవర్నర్తో అబద్ధం చెప్పించారని, రైతులకు ఇస్తామని చెప్పిన రూ.15వేల రైతు భరోసా గురించి గవర్నర్ ప్రసంగంలో చేర్చనే లేదని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామకపత్రాలు ఇచ్చి తామే ఇచ్చినట్టు కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని దెప్పిపొడిచారు. రెండేండ్ల పాలనలో నిరుద్యోగులకు ఏం చేశారో గవర్నర్ ప్రసంగంలో లేకపోవడం ఆ పార్టీ చిత్తశుద్ధిని బయటపెట్టిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హామీలు అమలయ్యేంత వరకూ బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టంచేశారు.
హామీల ముచ్చటేది?: కౌశిక్రెడ్డి
గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం హామీలు విస్మరించి పచ్చి అబద్ధాలు చెప్పించిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధ్వజమెత్తారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్నా ఆరు గ్యారెంటీల ఊసే ఎత్తలేదని విమర్శించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ పెండ్లి చేసుకున్న ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని, అవ్వాతాతలు, అత్తాకోడళ్లు ఇద్దరికీ పింఛన్లు ఇస్తామని మోసం చేసిందని దుయ్యబట్టారు. అశోక్నగర్కు వెళ్లి యువతకు రెండు లక్షల ఉద్యోగాలిస్తామని రాహుల్గాంధీతో చెప్పించి ఇప్పుడు ఆ ముచ్చటే మాట్లాడడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు వైఫల్యాలను అసెంబ్లీలో నిలదీస్తామని పేర్కొన్నారు.
దేవాలయంలాంటి అసెంబ్లీలో అబద్ధాలు: ఎమ్మెల్యే సంజయ్
పవిత్రమైన దేవాలయం లాంటి అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ నోటా పచ్చి అబద్ధాలు చెప్పించిందని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల దుయ్యబట్టారు. హామీలు మరిచి రైతుల నుంచి నిరుద్యోగుల దాకా ఢోకా చేసిందని మండిపడ్డారు. మహిళలు, నిరుద్యోగులు, బడుగు బలహీనవర్గాల తరుఫున శాసనసభలో గొంతెత్తుతామని చెప్పారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం వెంటపడుతామని, అధికార పార్టీ అవినీతి బాగోతాన్ని ఆధారాలతో సహా బట్టబయలు చేస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ మునిగే నావ: మల్లారెడ్డి
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావలాంటిదని, అందులో ఎవరైనా చేరుతారా? అని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రశ్నించారు. పార్టీ మారబోతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై సోమవారం అసెంబ్లీ వద్ద వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. ‘ప్రస్తుతం నా వయసు 73 ఏండ్లు. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు’ అని మల్లారెడ్డి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఎవరు బలంగా ఉన్నారో అందరికీ తెలుసని చెప్పారు. పెండ్లి రోజు వేడుకలకు రావాలని ఆహ్వానించడానికే సీఎం రేవంత్రెడ్డిని కలిసినట్టు వివరించారు.