MLA Seethakka | ములుగు, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి గడపకు కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇందులో నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష కుటుంబాల గడపలు కూడా ఉన్నాయి. అర్హులుగా నిర్ధారణ అయితే ప్రతిపక్ష పార్టీల కుటుంబాల సభ్యులకు కూడా పథకాలు దక్కుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తనపర భేదాలు, రాజకీయ వైషమ్యాలు లేకుండా అర్హులైన ప్రతిఒక్కరికీ పథకం అందజేస్తున్నది. ఇందుకు పోడు పట్టాల పంపిణీ ఒక నిదర్శనం. సంబురంగా పోడు పట్టా అందుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనసరి సీతక్క తల్లిదండ్రులే ప్రత్యక్ష సాక్ష్యం. ములుగు మండలం జగ్గన్నపేట గ్రామానికి చెందిన ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క) తల్లిదండ్రులు ధనసరి సమ్మయ్య-సమ్మక్క గురువారం పోడు పట్టాను అందుకున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం సీతక్క తండ్రి సమ్మయ్యకు ఎకరం 17గంటల భూమి పట్టాపాస్ పుస్తకాన్ని జడ్పీటీసీ భవాని, ఎంపీపీ శ్రీదేవి, తహసీల్దార్ సత్యనారాయణస్వామి, ఎంపీటీసీ విజయ్రాంనాయక్, సర్పంచ్ సువర్ణరాణి అందించారు.
సీతక్క తల్లిదండ్రులు పోడు పట్టా అందుకున్న విషయం తెలుసుకున్న ‘నమస్తే తెలంగాణ’ బృందం వారి స్వగ్రామం జగ్గన్నపేటకు చేరుకొని పలుకరించింది. సీతక్క తండ్రి సమ్మయ్య మాట్లాడుతూ.. 50 ఏండ్లుగా ఎకరం 17 గుంటల భూమిని సాగు చేస్తున్నానని, ప్రస్తుతం చేత కాకపోవడంతో వేరేవారితో వ్యవసాయం చేయిస్తున్నట్టు తెలిపారు. ఊహ తెలిసిన నాటి నుంచి నేటి వరకు వ్యవసాయమే ప్రాణంగా భావించి పంటలు పండించానని చెప్పారు. ఈ 50 ఏండ్లలో పోడు భూములు దున్నేందుకు చాలా మంది రైతులు భయపడే వారని, ఫారెస్టు అధికారులు కూడా ఇబ్బందులు పెట్టే వారని తెలిపారు. సీతక్క తల్లి సమ్మక్క మాట్లాడుతూ.. ఇప్పుడు తమ భూమికి పట్టా రావడం ఎంతో ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు. తమతోపాటు గ్రామంలోని దోమ ముత్తయ్య, ఐలు ముత్తయ్య, సారమ్మ, అజ్మీరా సర్దార్కు పట్టాలు వచ్చాయని వివరించారు. ‘అప్పట్ల పట్టా లేనందున ఎవరు వత్తరో, ఎవలు పోతరో, ఏమంటరో అని అందరు భయపడేది. ఇప్పుడు ఆ భయం లేదు. పట్టా భూమిని నా బిడ్డ సీతక్క కన్నా, నా కొడుకు పిల్లల కన్నా ఇస్తం’ అని తెలిపారు.