Podu Lands | ములుగు : రాష్టంలో సబ్బండ వర్ణాల సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పాలన అందుతున్నదనడానికి నిదర్శనమే పోడు పట్టాల పంపిణీ. కులమతాలకు అతీతంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతున్నది. అందుకు తాజా ఉదాహరణే కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలు అందజేయడం.
పోడు భూముల పట్టాల పంపిణీ రాష్ట్రంలో ప్రభంజనం సృష్టిస్తున్నది. అడవిని నమ్ముకొని వందల ఏండ్లుగా జీవిస్తున్న ఆదివాసీ బిడ్డలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. వారికి పోడు భూముల పట్టాలు అందజేసి వారి కష్టాలను తొలగించారు. అటవీ అధికారులు, గిరిజనుల మధ్య గొడవలు ఉండటం, ఘర్షణపూరిత వాతావరణం ఉండొద్దని తలచారు. అందుకు పరిష్కారమార్గాన్ని చూపారు. అటవీ భూములపై హక్కులు కల్పించి అడవి బిడ్డల ఆప్త బంధువయ్యాడు.
గిరిజనులు కండ్లల్లో వెలుగులు నింపుతుంటే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మొన్నటి వరకు ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్షాలు ఎన్నో ఆరోపణలు చేశాయి. పోడు భూములకు పట్టాలు ఇవ్వడం అసాధ్యమన్నారు. అవాకులు, చెవాకులు పేలిన ప్రతిపక్షాల మాట నిజం కాదని రుజువు చేసింది సీఎం కేసీఆర్ ప్రభుత్వం. మీరు మాటల్లో ముందుంటే మేం చేతుల్లో ముందుంటామని సీఎం కేసీఆర్ నిరూపించారు.
పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట గ్రామంలో ఎమ్మెల్యే సీతక్క తల్లిదండ్రులకు పోడు భూమి పట్టాలను తాసిల్దార్ సత్యనారాయణ స్వామి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సకినాల భవాని, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, ఎంపీటీసీ పోరిక విజయరామ్ నాయక్ పాల్గొన్నారు.