తిమ్మాపూర్ రూరల్, నవంబర్ 15 : కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మితే మోసపోక తప్పదని మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. బుధవారం తిమ్మాపూర్ మండలం పోలంపల్లి, మల్లాపూర్, నర్సింగాపూర్ గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ గ్యారెంటీలను నమ్మితే గోస పడతామని హెచ్చరించారు. వెలుగులు నింపే బీఆర్ఎస్ కావాలా? చీకట్లు తెచ్చే కాంగ్రెస్ కావాలా? ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. 60 యేండ్లలో చేయని అభివృద్ధి ఇప్పుడె ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి గ్రామాల్లోకి వస్తున్నాడని, కరోనా సమయంలో ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తాను అభివృద్ధి చేశానని, మరోసారి ఆశీర్వదించాలని కోరారు.