హైదరాబాద్ : బండి సంజయ్ది కూల్చుడు.. రేవంత్రెడ్డిది పేల్చుడని.. ఇద్దరూ సంఘవిద్రోహ శక్తులే.. వీరిద్దరితో తెలంగాణ ప్రశాంతతను కోల్పోతుందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు. ఇన్నేండ్ల సంది కేసీఆర్ నాయకత్వంలో ప్రశాంతంగా, సుభిక్షంగా ఉన్న తెలంగాణను చూసి వారు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారన్నారు. వాపును చూసి బలమని భ్రమపడుతున్న బీజేపీది బొబ్బ మాత్రమేనన్నారు. కేసీఆర్ నాయకత్వం ముందు రేవంత్రెడ్డి, బండి సంజయ్ నాయకత్వం ఎంత? ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు మీరు? కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్.. టక్కున ఓ 20 గ్రామాల పేర్లు చెప్పగలరా? అని ప్రశ్నించారు.
ఇప్పటికైనా ఇలాంటి విధ్వంసకర మాటలు, సంఘంలో చీలికలు తెచ్చే వ్యాఖ్యానాలు కాంగ్రెస్, బీజేపీ నేతలు మానుకోవాలని హితవు పలికారు. మీకు మా పాలనపై భయం, అసంతృప్తి ఉన్నాయోమో.. లైన్లలో నిలబడి ఓట్లు వేసే ప్రజలకు మాత్రం మా సుభిక్ష పాలనపై చాలా స్పష్టత ఉందన్నారు. ఈ సారి కూడా కాంగ్రెస్ రెండోస్థానంలోనే సరిపెట్టుకుంటుందన్న రసమయి.. పచ్చని తెలంగాణలో విద్వేషాలు, విధ్వంసాల గురించి మాట్లాడుతున్న రేవంత్రెడ్డి ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకపోతే నిన్ను అడుగడుగునా ప్రజలు నిలదీస్తారన్నారు.