KCR | హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): ‘నాకు వ్యక్తిగతంగా కేసీఆర్ అంటే చాలా ఇష్టం. ఆయనను కలిసింది రెండు, మూడుసార్లు మాత్రమే. ఆయన పాలన బాగుండేది. కేసీఆర్ పదేండ్లలో తెలంగాణ విలువను పది రెట్లు పెంచి చూపించారు’ అని టీడీపీకి చెందిన ఆంధ్రప్రదేశ్లోని ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఒక చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. ఉదాహరణకు కరీంనగర్లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఉండే ఎకరం ధర కేసీఆర్ హయాంలో రూ.70 లక్షలకు పెరిగిందని చెప్పారు.
హైదరాబాద్, దాని చుట్టుపక్కల కూడా భూముల విలువ బాగా పెరిగిందని వివరించారు. హైడ్రా కూల్చివేతల విషయంపై స్పందిస్తూ.. ‘ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వమే అన్ని పర్మిషన్లు ఇచ్చిన నివాసాలను కూల్చివేయడం చూస్తుంటే మనస్తాపానికి గురిచేస్తున్నది. అది ఎంతమాత్రం న్యాయం కాదు’ అని పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్టు పునర్జీవంపై మాట్లాడుతూ.. తెలంగాణ బడ్జెట్ రూ.మూడు లక్షల కోట్లు ఉంటే, మూసీకి రూ.1.54 లక్షల కోట్లు ఖర్చుచేయడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.