Prashanth Reddy | రేవంత్ రెడ్డి కక్ష్య సాధింపు ధోరణిలో భాగమే కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. చట్టాన్ని గౌరవించి కేసీఆర్ విచారణకు హాజరవుతున్నారన్నారు. బీఆర్ఎస్ అధినేతను నేరుగా ఎదుర్కోలేక నోటీసులతో ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్-బీజేపీ కూడబలుక్కొని కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. సబ్బండ వర్గాలను కలుపుకొని సుదీర్ఘ పోరాటం చేసి.. తెచ్చిన తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలపడానికి గత పదేళ్లలో అహోరాత్రులు కృషి చేశారన్నారు. తెలంగాణ బాగును కాంక్షించిన కేసీఆర్పై విచారణ పేరుతో వేధింపులకు గురి చేయాలని కాంగ్రెస్ చూస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ వెంట తెలంగాణ సమాజం ఉందని.. కుట్రలను ఛేదించి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెడుతామని.. ప్రజా కోర్టులో శిక్ష వేస్తామన్నారు.
టీడీపీ స్కూల్, బీజేపీ కాలేజీలో చదివా.. రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నానని రేవంత్రెడ్డి అంటున్నాడని.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో.. రాహుల్ గాంధీ ఇచ్చిన ఉద్యోగ ధర్మం నిర్వర్తించడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారన్నారు. అందుకే 45 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. మొన్నటి వరకు విద్యుత్పై కమిషన్ వేసి కేసీఆర్ను.. ఫార్ములా1లో విచారణ పేరుతో కేటీఆర్ను.. అలాగే పార్టీ నేతలను ఏ అవకాశం దొరికిన కక్ష సాధింపుతో ఇబ్బందులు పెట్టాలని కాంగ్రెస్ చూసిందని మండిపడ్డారు. 18 నెలలకే కాంగ్రెస్ పరిపాలన తెలంగాణకు శాపమని ప్రజలంతా అనుకుంటున్నారన్నారు. కేసులకు, విచారణలకు భయపడమని, ధైర్యంగా ఎదుర్కొన్నామని.. ఇకపై ఎదుర్కొంటామన్నారు. కుట్రలను ఛేదిస్తూనే.. ఇచ్చిన హామీల అమలు అయ్యేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు.