తొగుట, జనవరి 25 : దుబ్బాక నుంచి అసెంబ్లీకి పోటీచేసి బొక్కబోర్లా పడ్డా రఘునందన్రావు( Raghunandan rao)కు ఇంకా జ్ఞానోదయం కాలేదని, ఇష్టారీతిగా మాట్లాడితే సహించేది లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి(MLA Prabhakar Reddy) హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పెద్దమాసాన్పల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
నాడు తెలంగాణ ఉద్యమంలో, నేడు తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఓటమి ఎరుగని నేత హరీశ్రావుపై రఘునందన్రావు ప్రేలానణలు చేయడం తగదన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో అత్తెసరు మెజార్టీతో గెలిచిన రఘునందన్రావు ఎన్నికల హామీల్లో ఒక్క పనైనా నెరవేర్చారా అని ఆయన ప్రశ్నించారు. నేను ఎంపీగా ఉన్న సమయంలో పార్లమెంటులో ఏం మాట్లాడానో, ఎన్ని నిధులు తెచ్చానో తెలుసుకున్న తర్వాత మాట్లాడాలని హితవు పలికారు.
తాము సీఎం రేవంత్రెడ్డిని కలవడమే పాపమన్నట్లు మాట్లాడుతున్నారని, సీఎం కాంగ్రెస్ పార్టీకా, రాష్ర్టానికా తెలుసుకోవాలన్నారు. ప్రజలకిచ్చిన హామీల కోసం తాను బరాబరిగా సీఎంతో పాటు మంత్రులను కలుస్తామన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి జీవ గడ్డ అని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ స్థానంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, రఘునందన్రావుకు మరోసారి ఎన్నికల్లో ప్రజలు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు.