హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్)ను కాదని సీబీఐకి బదిలీ చేయడం సరికాదు అని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈడీ చేసిన విచారణలో ఏమి దొరకలేదు కాబట్టే సీబీఐని రంగంలోని దించుతున్నారని భావిస్తున్నానని రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత.. దాన్ని ఆధారం చేసుకుని అప్పీల్కు వెళ్లాలా? సుప్రీంకోర్టుకు వెళ్లాలా? అన్నది నిర్ణయిస్తాం అని తెలిపారు.
సీబీఐ, ఈడీ, ఐటీ కేంద్రం చేతిలో అస్త్రాలుగా మారాయని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఆర్దర్ కాపీ వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. సిట్ను కాదని సీబీఐకి బదిలీ చేయడం సరికాదన్నారు. దేశంలో ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు గమనించాలని సూచించారు. దొంగ స్వాములతో సంబంధం లేదంటూనే బీజేపీ వారిని కాపాడే ప్రయత్నం చేస్తోందన్నారు. బీఎస్ సంతోష్ దొంగ పని చేయకపోతే విచారణకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఈ కేసు ఈడీ పరిధిలోకి రాకపోయినా విచారణకు పిలిచారు. ఈడీ విచారణపై హైకోర్టులో రిట్ దాఖలు చేశానని తెలిపారు. బీజేపీ నేతలు, దొంగస్వాములు చెప్పిందే జరుగుతోందన్నారు. కోర్టులను బీజేపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారు. న్యాయం తమ వైపు ఉందన్నారు. న్యాయ వ్యవస్థ ఏ తీర్పు ఇచ్చినా కట్టుబడి ఉంటామని రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు.