వరంగల్, డిసెంబర్ 3 : ‘ఆంధ్రప్రదేశ్లోని పులివెందులలో ఓటు వేసి తెలంగాణలో రాజకీయం చేస్తున్నావు.. ఆంధ్రాలో ఓటు వేసి తెలంగాణలో ప్రశ్నిస్తున్నావా?’ అంటూ వైఎస్ షర్మిలను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. శనివారం హనుమకొండలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రం, ఏపీ ప్రభుత్వం సృష్టిస్తున్న అడ్డంకులపై సమాధానం చెప్పాలని షర్మిలకు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ వచ్చిన తొమ్మిదేండ్ల తర్వాత షర్మిలకు తెలంగాణ బిడ్డ అనే విషయం గుర్తుకొచ్చిందా అని ఎద్దేవా చేశారు.
తెలంగాణలో షర్మిల పాదయాత్ర కేంద్రం, ఏపీ ప్రభుత్వం ఆడిస్తున్న డ్రామా అని ఆరోపించారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన పరిమితుల మేరకు పాదయాత్ర చేసుకోవచ్చని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. తెలంగాణ వ్యతిరేకి వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరుతో పెట్టిన పార్టీతో తెలంగాణలో రాజకీయం చేస్తే ఆత్మాభిమానం కలిగిన తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేరని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నదని చెప్పారు. తెలంగాణ సీఎం కేసీఆర్పై, ఉద్యమకారులపై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
కాగా, పోలవరం ముంపు పేరుతో ఏడు మండలాలు తీసుకోవడంతో పాటు సీలేరు జల విద్యుత్తు కేంద్రం విషయంలో కేంద్రం, ఏపీ ప్రభుత్వం ఏకమై తెలంగాణను చేసిన మోసంపై ఏమంటారో చెప్పాలని పేర్కొన్నారు. ‘తెలంగాణ రైతుల కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రి ఆంక్షలు విధించారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి రాసిన లేఖకు స్పందిస్తూ ఆంక్షలు విధించాలని మీకు మద్దతు ఇస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా లేఖ రాశారు. దొంగాట ఆడుతున్న ఈ ఇద్దరి లేఖలు, తెలంగాణకు వారు చేస్తున్న అన్యాయంపై స్పందించాలి’ అని షర్మిలకు రాసిన లేఖలో డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం బ్లాక్మెయిల్ చేస్తే ఏపీ సీఎం తలొగ్గి అక్కడ మోటర్లకు మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకిస్తున్నారా? సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు.