MLA Palla Rajeshwar Reddy | హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు కింద సిద్ధం చేసిన రూ.7,500 కోట్లు, గత వంద రోజుల్లో చేసిన అప్పు రూ.16,500 కోట్లు.. మొత్తంగా రూ.24 వేలకోట్లు ఎక్కడికి పోయాయని కాంగ్రెస్ సర్కారును బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. ఈసీకి ఫిర్యాదు చేసి రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో పడకుండా అడ్డుకున్నారని, ఇవ్వాళ ఆ డబ్బును ఎవరు వాడుకున్నారో తెలుసని అన్నారు. ఇంతవరకు రైతుబంధు అందరికీ ఇవ్వలేదని విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్రెడ్డి, బీఆర్ఎస్ కార్యదర్శి రూప్సింగ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాలు, రాళ్ల వానతో రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా, పంట నష్టాన్ని అంచనా వేయటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉన్నదని, రైతులకు భరోసా కల్పించేందుకు సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి, ఇతర మంత్రులు ఎవరూ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించలేదని మండిపడ్డారు.
40 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పంటనష్టంపై పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, కానీ, బీఆర్ఎస్ సర్కారులో ఎకరానికి రూ.10వేల పంట నష్టాన్ని ఇచ్చినట్టు వెల్లడించారు. ఏదో కొత్తగా ఇస్తున్నట్టు తుమ్మల చెప్తున్నారని అన్నారు. తమ హయంలో అకాల వర్షాలకు పంట నష్టం జరిగితే వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, మంత్రి సబితాఇంద్రారెడ్డి, తాను వికారాబాద్ జిల్లాలో పర్యటించి రైతులను పరామర్శించామని తెలిపారు. ఆ తర్వాతి రోజు స్వయంగా అప్పటి సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటించారని వివరించారు. ఖమ్మం జిల్లా బోనకల్లు, తొర్రూరు మండలం, నర్సంపేట, చొప్పదండికి వెళ్లి పంట నష్టాన్ని పరిశీలించారని గుర్తుచేశారు. నష్ట పరిహారానికి సంబంధించి రూ.151కోట్ల మొదటి దశ జీవో, రెండో దశలో నష్టపరిహారం అంచనా వేసి 3 వేల గ్రామాల్లో 2.79 లక్షల మంది రైతులకు చెందిన రూ.3.04 లక్షల ఎకరాల్లో పంట జరిగిందని అంచనా వేశామని తెలిపారు. రూ.304 కోట్ల నష్టం జరిగిందని, దాని కోసం జీవో 19 విడుదల చేశామని చెప్పారు. పంటల పరిశీలనలో భాగంగా ఎమ్మెల్యే కాకున్నా తుమ్మల నాగేశ్వరరావును కేసీఆర్ హెలికాప్టర్లో ఎకించుకొన్నది నిజమా? కాదా? అని ప్రశ్నించారు. పాలేరు నియోజకవర్గంలో భక్తరామదాసు ఎత్తిపోథల పథకాన్ని అతి తక్కువ కాలంలో పూర్తి చేస్తే కేసీఆర్ను అపర భగీరథుడు అని తుమ్మల పొగిడింది నిజం కాదా? అని నిలదీశారు.
కేసీఆర్ హయంలో రైతులు అత్యధికంగా వరి పండించారని, దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని పల్లా రాజేశ్వర్రెడ్డి తెలిపారు. రైతులు మిర్చి అత్యధికంగా పండించారని, పత్తి విషయంలోనూ దేశంలో మూడో స్థానానికి చేరుకున్నామని వివరించారు. కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయని, దొంగ కరెంట్ ఇచ్చి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తమ హయంలో ఎండాకాలంలోనూ సాగు నీళ్లు ఇచ్చామని, సమ్మక బ్యారేజ్ దగ్గర నీళ్లను ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు నీరు, తాగు నీరు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
అక్రమాలు చేయడానికే కొందరు అధికార పార్టీలోకి వెళ్తున్నారని, వారి అక్రమాలను బీఆర్ఎస్ పార్టీయే బయట పెడుతుందని పల్లా స్పష్టంచేశారు. కొంతమంది పిరికి పందలు, వ్యాపారమే రాజకీయమని, రాజకీయాలను భ్రష్టుపట్టించినవారు, సిగ్గూఎగ్గూ లేకుండా, ప్రజలు ఏమనుకుంటారోనన్న సోయిలేకుండా.. వ్యక్తిగత స్వలాభం కోసం ఇంకో పార్టీలోకి మారటం శోచనీయమని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నుంచి ఎన్నికైనవాళ్లు రాజీనామా చేసి వెళ్లాలని డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నది, కార్యకర్తలను జైల్లో పెడుతున్నది’ అని ఆరోపించారు. ఎవరు ఎక్కడికి పోయినా తాము పోలీస్స్టేషన్కు వస్తామని, అందరినీ కాపాడుకుంటామని స్పష్టం చేశారు. బెదిరించి, అక్రమకేసులు పెట్టి ఇబ్బంది పెడితే వారికి తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు.