జనగామ చౌరస్తా, ఏప్రిల్ 9 : జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని ఓ సైబర్ కేటుగాడు మోసం చేసిన ఉదంతం సంచలనం రేపింది. గురువారం నియోజకర్గ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే పల్లా మీడియాకు వివరాలు వెల్లడించారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అడిషనల్ సెక్రటరీ వెంకట్రామ్రెడ్డిని
మాట్లాడుతున్నానంటూ ఈ నెల 5న సైబర్ కేటుగాడు ఎమ్మెల్యేకు ఫోన్ చేశాడు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ పథకంలో భాగంగా జనగామ నియోజకర్గంలోని 40 మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించడానికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపాడు.
అందులో రూ. 5 లక్షలు మాఫీ అవుతాయని, మిగతా రూ.5 లక్షలు నెలకు రూ.2,500 చొప్పున కిస్తీలు కట్టాల్సి ఉంటుందని చెప్పాడు. ఎమ్మెల్సీగా పల్లా ఉన్న సమయంలో తాను జడ్పీ సీఈవోగా పనిచేసినట్టు, తన భార్య సుధారాణి గెజిటెడ్ అధికారిగా పనిచేస్తున్నదంటూ నమ్మించాడు. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 5 చివరి రోజు కావడంతో 40 మంది దరఖాస్తు వివరాలతో పాటు మొదటి నెల ఈఎంఐ ఒక్కొక్కరికి రూ. 2,500 చొప్పున లక్షచెల్లించాలని కోరాడు. వెంటనే పల్లా సతీమణి ఖాతా నుంచి రూ.లక్ష కేటుగాడి ఖాతాకు ఫోన్పే చేశాడు. కాసేపటి తర్వాత ఫోన్ నంబర్ పనిచేయకపోవడంతో మోసపోయినట్టు గ్రహించి.. సైబర్క్రైమ్కు ఫిర్యాదు చేశారు.