మెదక్ : హత్యాయత్నానికి గురైన మెదక్ ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి(Kotha Prabhakar reddy) త్వరగా కోలుకోవాలని మెదక్ సీఎస్ఐ చర్చి(,CSI Church)లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మంగళవారం ప్రార్థనలు చేశారు. హత్యాయత్నానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలన్నారు. కాగా, ప్రభాకర్ రెడ్డి పై హత్యాయత్నాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో బంద్(Dubbaka bandh) ప్రశాంతంగా కొనసాగుతున్నది.
వ్యాపార సంస్థలు, దుకాణాలు, పాఠశాలలు, మార్కెట్లు స్వచ్ఛందంగా మూసివేశారు. దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హత్యాయత్నానికి పాల్పడిన నిందితులు, రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుబ్బాక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొత్త ప్రభాకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ మృత్యుంజయ హోమం, ప్రత్యేక పూజలు చేశారు.